మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల డెడ్ లైన్!
ప్రధాని మోదీ వీడియో తొలగించడంపై ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాకే పార్లమెంటరీ కమిటీ డెడ్ లైన్ విధించింది. మూడు రోజుల్లోగా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. అలా చేయకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్బుక్ వీడియోను తొలగించిన ఘటనపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు పార్లమెంటరీ సమాచార సాంకేతిక స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మూడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమిటీ ఆదేశించింది. లేనిపక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3) కింద కంపెనీకి ఉన్న రక్షణను ఉపసంహరించి, ప్రచురణకర్తగా పరిగణించి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
లోక్సభ సచివాలయం నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పరీక్షల వివాదాలు, పేపర్ లీక్లపై విద్యార్థులు, జెన్-జెడ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ ఐదు నుంచి ఆరు గంటల పాటు అందుబాటులో లేకుండా చేయడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CASM), మహిళలను కించపరిచే పోస్టులను తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా మధ్యవర్తి వేదికలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమావేశంలో మోసపూరిత యాప్ల ద్వారా పెట్టుబడిదారులు రూ.48 లక్షలకు పైగా నష్టపోయిన కేసులో గూగుల్ ఇండియా పాత్రపై కూడా చర్చ జరిగింది. సైబర్ మోసగాళ్లతో పాటు సంబంధిత సంస్థల బాధ్యతను కూడా పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.
అయితే ఈ ఘటనపై మెటా ఇప్పటికే స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే వీడియో పొరపాటున తొలగించబడిందని, అనంతరం దాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపింది. ఈ వివరణపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సాంకేతిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
