AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

PM Narendra Modi Interview: ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం చాలా పెద్ద విషయం కావచ్చు.. కానీ తన దృష్టిలో ప్రజా సేవ కోసం ఏదైనా

PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ
Pm Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2021 | 2:00 PM

Share

PM Narendra Modi Interview: విమర్శలు వేరు, ఆరోపణలు వేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ల కొరత, వైద్య సదుపాయాలు, మెడిసిన్ కొరత, తదితర అంశాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. విమర్శలు వేరు, ఆరోప‌ణ‌లు వేర‌ని పేర్కొన్నారు. చాలా మంది ఎక్కువ‌గా ఆరోప‌ణ‌లు మాత్రమే చేస్తార‌ని, కానీ విమర్శలు చేయాలంటే.. లోతైన అధ్యాయనం.. అవ‌స‌ర‌మ‌ని ప్రధాని పేర్కొన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో తాను విమర్శకులను మిస్ అవుతుంటాన‌ంటూ మోదీ పేర్కొన్నారు. విమర్శకులందరినీ గౌరవిస్తానంటూ ప్రధాని మోదీ ‘ఓపెన్ మ్యాగజైన్‌’కు ఇచ్చిన ఇంటర్వూలో వ్యాఖ్యానించారు.  

ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం చాలా పెద్ద విషయం కావచ్చు.. కానీ తన దృష్టిలో ప్రజా సేవ కోసం ఏదైనా చేయడానికి మార్గాలను అన్వేషించడమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే మార్గాలను అన్వేషించడం.. వారికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం తనకు ముఖ్యమని.. ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు ప్రతి యువకుడు అవకాశాలు పొందడం ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. అయితే.. యువత వేరే వారిపై ఆధారపడకుండా.. స్వయం శక్తితో తమ లక్ష్యాలను చేరే విధంగా సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల ప్రజా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఓపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రధాని మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014 వరకు కొనసాగారు. వరుసగా.. మూడు సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం 2014లో ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టి రెండోసారి కూడా మోదీ కొనసాగుతున్నారు. అయితే.. 20 ఏళ్ల ప్రజా ప్రస్థానం గురించి మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విస్తృతమైన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి తన ప్రయాణం, పరిపాలన సవాళ్లు, ప్రపంచం మొత్తం భారత్ వైపు దృష్టిసారించేలా చేయడంలో అతని పాత్ర, తదితర అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడారు.

భిన్నమైన ప్రపంచం..

తనకు మొదట నుంచి రాజకీయ రంగంతో సంబంధం లేదని.. మోదీ పేర్కొన్నారు. తన ప్రపంచం మొత్తం భిన్నంగా ఉండేదని.. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడినని మోదీ తెలిపారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రతిపాదించిన ‘జన్ సేవా హి ప్రభు సేవా’ తన మార్గమని మోదీ స్పష్టంచేశారు. ఎల్లప్పుడూ తనకు అవే ప్రేరణ, మార్గదర్శకాలని మోదీ పేర్కొన్నారు. తాను ఏమి చేసినా.. అవే కారణమని.. తిరుగులేని విధంగా తన జీవితాన్ని మలుపు తిప్పాయని పేర్కొన్నారు. రాజకీయాల విషయానికొస్తే.. తనకు రిమోట్ కనెక్షన్ కూడా లేదని.. చాలా కాలం తరువాత మారిన పరిస్థితులు, కొంతమంది స్నేహితుల ఒత్తిడి మేరకు తాను రాజకీయాల్లో చేరానంటూ పేర్కొన్నారు. అక్కడ కూడ తాను ప్రధానంగా సంస్థాగతంగా పని చేసేందుకు ఇష్టపడ్డానని తెలిపారు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం.. పరిపాలనకు నాయకత్వం వహించే విధంగా.. పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2001లో అదే జరిగిందని.. ప్రతికూల పరిస్థితులు తనను ఉన్నతమైన ఆలోచనలకు పునాది వేశాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశానని.. ఇప్పటివరకు ఇంత ఎదిగినా తన జీవితంలో కొత్త మలుపు అంటే ఏమిటో ఆలోచించే సమయం కూడా లేకుండా పోయిందన్నారు.

ఎవరైనా సాధించగలరు.. 

భారత సమాజం తన చుట్టూ ఉన్న ప్రజలే తనను టీ అమ్మే స్థాయి పేదరికం నుంచి దేశప్రధాని స్థాయికి తీసుకెళ్ళారని, ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం కూడా అని మోదీ తెలిపారు. తాను చిన్నతనంలో టీ అమ్మడం.. ఆ తర్వాత దేశానికి ప్రధాన మంత్రి కావడం లాంటి వాటికన్నా.. చాలా భిన్నంగా ఆలోచిస్తానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి సామర్థ్యాలు తనకు ఉన్నాయని భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. తాను సాధించినది, ఎవరైనా సాధించగలరని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తాను చేయగలిగింది.. ఎవరైనా చేయవచ్చని.. అదే మన సంకల్పమని పేర్కొన్నారు. దేశంలోని 130 కోట్ల మంది సమర్థులైనవారేనని మోదీ అభిప్రాయపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో మానవజాతికి మన దేశం అందించగల సహకారం చాలా గొప్పదని మోదీ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ నుంచి ప్రారంభమై.. ఎక్కడికి చేరుకున్నాను.. ఏం చేశాను.. వ్యక్తిగత అనుభవాలు ఏమిటి అన్న విషయాలను పెద్దగా పట్టించుకోనని.. చివరి నిమిషం వరకూ ప్రజా సేవ చేయడమే తన అభిమతమని వెల్లడించారు. ఇంకా ఈ ఇంటర్వూలో 20ఏళ్లల్లో తాను చూపించిన మార్క్, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, పలు రంగాల అభివృద్ధి, క్రీడలు, తదితర రంగాల గురించి మోదీ క్లుప్తంగా మాట్లాడారు.

విమర్శకులను గౌరవిస్తా..

వ్యాక్సిన్ డ్రైవ్ స‌క్సెస్ అంశంలో లాజిస్టిక్స్‌, ప్లానింగ్ లాంటి అంశాల‌ను అందరూ ప‌రిశీలించాల‌ని ఆతర్వాత విమర్శలు చేయాలంటూ ప్రతిపక్షాలకు చురకలంటించారు. విమర్శలు, ఆరోపణలు వేర్వేరు అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియను చేప‌ట్టామ‌ని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ఇక్కడే జ‌రుగుతోంద‌న్నారు. దాన్ని మీడియా హైలెట్ చేస్తుంద‌ని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేశామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మత్రం.. స్వయం స‌మృద్ధిగా ఎదిగేందుకు దోహదపడిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగవంతంగా విజయం కావ‌డంలో టెక్నాల‌జీ కీల‌క పాత్ర పోషించిందన్నారు. ఇప్పటివ‌ర‌కు దేశంలో ఉన్న వ‌యోజ‌న జ‌నాభాలో 69 శాతం మంది క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. 25 శాతం మంది మాత్రం రెండు డోసుల టీకాలు తీసుకున్నారని చెప్పారు.

డిసెంబర్ చివరి నాటికి అందరికీ వ్యాక్సిన్..

ఇదే రీతిలో డిసెంబ‌ర్ చివ‌రి క‌ల్లా యావ‌త్ దేశాన్ని వ్యాక్సినేట్ చేయనున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక‌వేళ మ‌న దేశం వ్యాక్సిన్ త‌యారు చేయ‌కుంటే, అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయాలన్నారు. ఇప్పటికీ.. కోవిడ్ వ్యాక్సిన్ అంద‌ని దేశాలు ఉన్నాయ‌ని.. వాటి పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుందన్నారు. మనం ముందుగానే వ్యాక్సిన్‌ను తయారు చేసుకున్నామని.. అదే మన ఘనతని ప్రధాని అభిప్రాయపడ్డారు. భార‌త్ ఆత్మనిర్భర్ కావ‌డం వ‌ల్లే వ్యాక్సినేష‌న్‌లో స‌క్సెస్ సాధించిన‌ట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ పరిశోధనలకు పెద్ద పీట వేస్తుందని.. అన్ని రంగాలకు సమాన అవకాశాలను కల్పిస్తుందని మోదీ పేర్కొన్నారు. జై జ‌వాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్ మంత్రాన్ని జపిస్తూ తన పాలనలో మార్పులు తీసుకొచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని.. స్వయం సమృద్ధే తమ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు.

స్వార్థ ప్రయోజనాలుంటే..

ఇదివరకు అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందనే ఏర్పడ్డాయని.. అందువల్ల దేశంలోని రాజకీయ, ఆర్థిక ఆలోచనల మధ్య పెద్దగా తేడా కనిపించలేదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వార్థ ప్రయోజనాలు కనిపిస్తే వాటిని స్వచ్ఛందంగా నియంత్రిస్తానని మోదీ పేర్కొన్నారు. మేలు జరిగే నిర్ణయాలైతే.. దృఢంగా ముందడుగు వేస్తానని తెలిపారు. మన రాజకీయ వ్యవస్థలోని విభిన్నమైన అంశాలున్నాయని.. ప్రజలను చూసే విధానంలో సమస్య ఉందని తెలిపారు. కొన్ని వర్గాలు అధికార శక్తినే అనుసరిస్తాయని.. సహజమైన విషయాలను పట్టించుకోరని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే.. అలాంటి రాజకీయాల్లో మార్పు చోటుచేసుకుందన్నారు. అలాంటి పరిస్థితిలో ఎవరూ ఉండకూడదని.. సమానత్వం అందరికీ అవసరమన్నారు. కొన్నింటి కోసం అవసరమైతే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నారు.

వారిని చూస్తే జాలేస్తుంది..

దీంతోపాటు ప్రధాని మోదీ రైతు ఉద్యమం కూడా తొలిసారిగా స్పందించారు. రైతు అనుకూల సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే.. వారి మేధో సంపత్తికి ఏమైందోనని జాలేస్తుందన్నారు. వారు అనవసరమైన విషయాలను ఆలోచిస్తున్నారంటూ చురకలంటించారు. చిన్న రైతులను అన్ని విధాలుగా శక్తివంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల గురించి ఆందోళనకారులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇదే విషయాన్ని మొదటి రోజు నుంచి చెతుతున్నట్లు మోదీ తెలిపారు. అనేకసార్లు రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయని.. చట్టాల్లో మార్చాలని కోరుతున్నవారు నిర్దిష్టమైన ప్రణాళికలతో ఇప్పటివరకు ముందుకు రాలేదన్నారు. దీంతోపాటు ప్రభుత్వం ఆర్థిక పురోగతి కోసం అనేక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. నోట్ల రద్దు, ఆధార్, జీఎస్‌టి అనుసంధానం లాంటివి ఆర్థిక పురోగతికి దోహద పడ్డాయన్నారు.

అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

ప్రజా సంక్షేమానికి తీసుకొస్తున్న పథకాలు, ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వ పాలనను తెలుపుతున్నాయన్నారు. దీంతోపాటు భద్రతా దళాలకు ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటివి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పు అని.. దేశ భద్రత మరింత ముఖ్యమని మోదీ స్పష్టంచేశారు. కొత్త పార్లమెంటు గురంచి పలు రాజకీయ పార్టీలు తమను అనవసంరగా ఎగతాళి చేస్తున్నాయంటూ విమర్శించారు. అంతకుముందు పాలించిన వారు కూడా కొత్త పార్లమెంట్ అవసరమని చెప్పారని.. ఎవరైనా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే.. కొంతమంది సాకులు చెప్పి విమర్శిస్తుంటారని మోదీ పేర్కొన్నారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారంటూ ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.

Also Read:

Lal Bahadur Shastri: మహానేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు.. ఆయన డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Gandhi Jayanti 2021: మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం.. గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ..

Follow Us