Parliament Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..అస్త్ర,శస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతి పక్షాలు
పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతాయి. విపక్ష నేతలపై ముప్పేట ఈడీ , సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మాటల తూటాలు పేలబోతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.
పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతాయి. విపక్ష నేతలపై ముప్పేట ఈడీ , సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మాటల తూటాలు పేలబోతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ జరగనుంది. అదేవిధంగా కీలక బిల్లులు ఆమోదానికి సమావేశాల ముందుకు రానున్నాయి. ఉభయసభల్లో 35 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభలో 26 బిల్లులు, లోక్సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష నేతలను ఆయన కోరారు. మరోవైపు బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలనే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీంతో ఇటీవల జరుగుతోన్న సీబీఐ, ఈడీ దాడులు, అరెస్టుల అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఆర్థికబిల్లును ఆమోదించుకోవడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. తొలుత ఇది ఆమోదం పొందిన తర్వాతే విపక్షాల డిమాండ్లపై చర్చిస్తామన్నారు.
మొత్తానికి ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందడమే ప్రాధాన్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు, అదానీ వ్యవహారం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యాయి. మొత్తానికి విపక్ష నేతల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు , అదానీ వ్యవహారంపై పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు దద్దరిల్లబోతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..