Pakistan Army Chief: ఆరేళ్ళలో అమాంతం పెరిగిన పాకిస్తాన్ ఆర్మీచీఫ్ ఆస్తులు.. అత్యంత తక్కువ సమయంలో బిలియనియర్గా మారిన జావేద్ బజ్వా..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆస్తులు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఓ పక్క పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంటే, పాక్ ఆర్మీచీఫ్ మాత్రం వేలకోట్లు వెనకేసుకున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఆస్తులు గత ఆరేళ్ళలో అమాంతం పెరిగిపోయిన విషయాన్ని ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ బట్టబయలు చేసింది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇస్లామాబాద్, కరాచీల్లో కమర్షియల్ ప్లాజాలు, ప్లాట్లు..లాహోర్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు.. దేశ విదేశాల్లో కోట్ల విలువైన వ్యాపారాలు.. ఇది ఎవరో వ్యాపారదిగ్గజం ఆస్తుల సమాచారం కాదు. అక్షరాలా ఓ దేశానికి రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఆస్తుల వివరాలు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెనకేసుకుంటోన్న ఆస్తులపై ఫ్యాక్ట్ ఫోకస్ పాకిస్తాన్ జర్నలిస్టు అహ్మద్ నూరాని వెల్లడించిన నిజాలు చూసి ఇప్పుడంతా అవాక్కవుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా సన్నిహిత కుటుంబ సభ్యుల సంపద ఆరేళ్ల కాలంలో భారీగా పెరిగిందని తాజా నివేదిక బయటకొచ్చింది. జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం రెండు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాక్ ఆర్మీచీఫ్, ఆయన కుటుంబం, గత ఆరేళ్ళలో 12.7 బిలియన్ల డబ్బుని పాకిస్తాన్లోనూ, ఇతర ప్రాంతాల్లో కూడబెట్టినట్టు బట్టబయలైంది. 2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్…తన ఆస్తుల విలువ సున్నా అని ప్రకటించారు. అయితే ఒకే ఒక్క ఏడాదిలో 2016లో ఆమె ఆస్తులు రూ.220 కోట్లకు చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బజ్వా కోడలు మహనూర్ ఆస్తులకూ రెక్కలొచ్చాయి.
బజ్వా కొడుకు మహనూర్ పెళ్ళి జరిగిన వారానికే ఆయన ఆస్తులు 127 కోట్లరూపాయలకు పెరిగినట్టు ఫ్యాక్ట్ ఫోకస్ రిపోర్టు వెల్లడించడం ఇప్పుడ సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. మరికొద్ది కాలంలో పాక్ ఆర్మీ చీఫ్ పదవీకాలం ముగియనుంది. మరోవైపు పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి, అంతర్జాతీయంగా అభాసుపాలవుతోంది. ఇలాంటి సమయంలో ఈ విమర్శలు పాక్లో కాకరేపుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం