మోగింది మరో నగారా … అక్టోబర్ తర్వాత పెను మార్పులకు ఛాన్స్ !

దేశంలో మరో సారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. అక్టోబర్ 21న తేదీన ఒకే విడతగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామని అరోరా ప్రకటించారు. ఈ రెండు అసెంబ్లీలతో పాటు వివిధ కారణాలతో పలు రాష్ట్రాలలో ఖాళీ అయిన 64 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ లోని […]

మోగింది మరో నగారా ... అక్టోబర్ తర్వాత పెను మార్పులకు ఛాన్స్ !
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:53 PM

దేశంలో మరో సారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. అక్టోబర్ 21న తేదీన ఒకే విడతగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామని అరోరా ప్రకటించారు. ఈ రెండు అసెంబ్లీలతో పాటు వివిధ కారణాలతో పలు రాష్ట్రాలలో ఖాళీ అయిన 64 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ లోని సమస్తీపూర్ లోకసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్టు అరోరా వెల్లడించారు. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనున్నది. అదే రోజు ఫలితాలు వెలువరిస్తారు. ఈ 64 అసెంబ్లీ స్థానాలు మొత్తం 18 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానాలను కూడా కలుపుకుంటే అక్టోబర్ ఎన్నికల సమరం మొత్తం 20 రాష్ట్రాలలో జరగనుంది. మే నెలలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో అనూహ్యంగా బంపర్ మెజారిటీ దక్కించుకున్న బీజేపీకి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఇపుడు ఉప ఎన్నికలు జరగనున్న 18 రాష్ట్రాలలో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది.. మరికొన్ని రాష్ట్రాలలో వేళ్ళూనుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఎన్నికలు మోదీ సర్కార్ కు, బీజేపీకి అత్యంత కీలకం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాలలో ఆల్రెడీ కునారిల్లిపోయింది.. అందువల్ల అక్టోబర్ ఎన్నికల ఫలితాల్లో లక్కీగా సీట్ల సంఖ్య పెరిగితే ఆ పార్టీకి బోనస్ కిందే లెక్క. కానీ బీజేపీ పరిస్థితి ఆలా కాదు.. పొరపాటున నెంబర్ తగ్గితే 4 నెలల మోదీ సర్కారుపై ప్రజల్లో ఇమేజ్ తగ్గిందంటూ ప్రతిపక్షాలు గోల పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు అసెంబ్లీ స్థానాలకు ఈ అక్టోబర్లో బై-ఎలెక్షన్స్ జరగబోతున్నాయి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాక్ విషయంలోను, కాశ్మీర్ విషయంలోనూ మోదీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. తలాక్ మేటర్ ఎలా ఉన్నా.. కాశ్మీర్ పై తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం నరేంద్ర మోదీ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. అయితే.. ఇపుడు జరుగబోతున్నవి అసెంబ్లీలకు ఎన్నికలు.. మరి మోదీ హవా, అయన చరిష్మా ఈ అసెంబ్లీ బై-పోల్ లో ఏ మేరకు ప్రభావం చూపుతాయి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇటీవల ఆసక్తి రేపిన కర్ణాటక పాలిటిక్స్ చివరికి బీజేపీకి అనుకూలంగా సుఖాంతమైంది. అయితే అక్కడ కాంగ్రెస్-జేడీ సర్కార్ కూలడానికి కారణమైన 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ ఐన 15 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.. కర్ణాటకలో రాజకీయ డ్రామా తర్వాత ఏర్పాటైన యడియూరప్ప సర్కార్ కు ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నాయి. గతంలోనే కళంకం మూట గట్టుకున్న యడియూరప్పకు సీఎం పీఠం ఇచ్చేందుకు ఒక దశలో అమిత్ షా వెనుకంజ వేసిన చివరికి ఉప ఎన్నికలలో విజయం తెచ్చిపెడతానన్న యడియూరప్ప మాటలను నమ్మే ఆయనను సీఎంని చేసింది బీజేపీ అధిష్టానం. సో.. ఇపుడు ఈ మొత్తం స్థానాలను గెలిపించకపోతే అయన పదవికే ఈసారి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు యూపీలో కూడా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోతోంది ఎన్నికల కమిషన్. అక్కడ బంపర్ మెజారిటీతో సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ కు కూడా ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే 2014 బీజేపీ సాధించిన 73 పార్లమెంట్ స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కాపాడుకోలేకపోయింది.. చివరికి మోదీ చరిష్మా, సర్జికల్ స్ట్రిక్స్ ఎఫెక్ట్, అమిత్ షా వ్యూహం కలిపి 60 స్థానాలతో బీజేపీ పరువు నిలబెట్టుకుంది. కానీ ఇపుడు జరిగేవి అసెంబ్లీ ఎన్నికలు.. మొత్తం యోగి పనితీరుపైనే ఆధార పడి వోటింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21 న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు యోగికి అత్యంత కీలకం కాబోతున్నాయి.

మొత్తానికి అక్టోబర్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమని చెప్పాలి. కాంగ్రెస్ తో కొనసాగుతున్న చిరకాల స్నేహంతో నష్టమే తప్ప లాభం లేదనుకుంటున్న శరద్ పవర్ సారధ్యంలోని ఎన్సీపీ, ఈ ఎన్నికలలో పరాజయం పొందితే కాంగ్రెస్ తో కటీఫ్ అనడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి శరద్ పవర్ ఇప్పటి నుంచే సంకేతాలిస్తున్నారు. మరోవైపు బీజేపీ, శివసేన మధ్య కూడా సఖ్యత అంత గట్టిగా ఏమి లేదు. ఈ ఎన్నికల్లో పొత్తు కుదురుతుందా లేదా అనే స్థాయిలో రెండు పార్టీల మధ్య ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఎన్నికలు జాతీయ స్థాయిలో రాజకీయంగా పెను మార్పులకు తెరలేపే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి.. కాశ్మీర్, అయోధ్య వంటి అంశాలతో బిజీ, బిజీగా ఉన్న మీడియా, రాజకీయ పార్టీలు ఆ రెండు అంశాలనుంచి దృష్టి మరల్చి ఎన్నికలపై పెట్టబోతున్నాయన్నది సుస్పష్టం.