మధ్యప్రదేశ్ లో విమానాలను హైజాక్ చేస్తానని బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్…. దర్యాప్తు ప్రారంభం
మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల నుంచి విమానాలకు పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ళ ఈ వ్యక్తి నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్ భోజ్ విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇలా బెదిరించాడట..
మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల నుంచి విమానాలకు పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ళ ఈ వ్యక్తి నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్ భోజ్ విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇలా బెదిరించాడట..దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. చివరకు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భోపాల్ కు సుమారు 100 కి.మీ. దూరంలోని షుజాల్ పూర్ లో ఇతడిని అరెస్టు చేశారు. ఈ బెదిరింపు కాల్ నేపథ్యంలో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబైకి వెళ్లే విమానం కాస్త ఆలస్యంగా భోపాల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. ఆ వ్యక్తి ఎందుకిలా హైజాక్ చేస్తానంటూ బెదిరించాడో తెలియడంలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ముఖ్యంగా పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానని చెప్పడం వెనుక ఏవైనా ఇతర సంఘ విద్రోహక శక్తుల హస్తం ఉందా అని ఆరా తీస్తున్నారు. లేక బుద్ధి మాంద్యంతో ఈ కాల్ చేశాడా అని కూడా తెలుసుకుంటున్నామని ఖాకీలు చెప్పారు. ఏమైనా సుమారు నాలుగైదు గంటలపాటు ఈ విమానాశ్రయాల్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసేవరకు ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నట్టు తెలిసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.