క్యాన్సర్ కీమో థెరపీ కోసం ఆస్పత్రికి బాలిక.. వైద్య పరీక్షల్లో గర్భం దాల్చినట్లు నిర్ధారణ
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 13 ఏళ్ల క్యాన్సర్ బాధితురాలిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కేసులో 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్లో పట్టుకున్నారు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

క్యాన్సర్తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ ఈస్ట్ ఏరియాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. బాలిక కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడు సూరజ్ సింగ్(29)పై పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి, బిహార్కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బిహార్కు చెందిన బాధిత బాలిక కుటుంబం.. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ ఈస్ట్ ఏరియాలో నివాసం అంటున్నారు. అక్కడే సొంతగా ఇల్లు కట్టుకున్నారు. అయితే, బాలికకు క్యాన్సర్ నిర్ధారణ అవ్వడంతో.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో కీమో థెరపీ చికిత్స తీసుకుంటుంది. అయితే, బాలిక కుటుంబానికి నిందితుడు సూరజ్ సింగ్ సన్నిహితంగా మెలిగేవాడు. దీంతో తెలిసిన వ్యక్తే కదా అని.. బాలిక కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని ఒక గదిని అతడికి అద్దెకు ఇచ్చారు. దీంతో బాలికపై కన్నేసిన సూరజ్ సింగ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
అయితే కీమో థెరపీ కోసం బాలికను ముంబై తీసుకెళ్లగా.. అక్కడ సాధారణ వైద్య పరీక్షల్లో బాలిక ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో కుటుంబీకులు ప్రశ్నించగా.. సూరజ్ సింగ్ తనను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సూరజ్ కోసం ప్రత్యేక టీమ్ను మహారాష్ట్ర నుంచి బిహార్కు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..