దొంగ దెబ్బ తీస్తోన్న పాకిస్థాన్.. సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు!
భారతదేశం జరిపిన వైమానిక దాడి పాకిస్తాన్ను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ మరోసారి నియంత్రణ రేఖపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొన్ని గంటలకే, పాకిస్తాన్ నియంత్రణ రేఖపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పాకిస్తాన్తో పోరాడుతున్నప్పుడు ఒక భారతీయ సైనికుడు అమరవీరుడయ్యాడు.

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదులిచ్చింది భారత్. మన భద్రతా బలగాల యాక్షన్తో.. కడుపుమంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై ప్రతాపం చూపిస్తోంది. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ దళాలు గురువారం(మే 08) వరుసగా రెండో రోజు కూడా కాల్పులకు తెగబడ్డాయి. పదే పదే కాల్పులకి తెగబడుతోంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేఫ్ జోన్లకు వెళ్లిపోతున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు.
ప్రాణ భయంతో జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టార్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్లు, మోర్టార్లను ప్రయోగించిందని, విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కాల్పులకు భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయి.
ఈ పిరికిపంద చర్యలతో పూంచ్ నుంచి జనం వెళ్లిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. చెప్పి మరీ పంజా విసిరింది. అక్కడి పౌరులకు ప్రాణనష్టం జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కానీ పాక్ ఆర్మీ మాత్రం దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ ఫైరింగ్ చేస్తోంది. కొద్దిరోజులుగా ప్రశాంతంగానే ఉన్నామని.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాల్పుల శబ్దాలు మళ్లీ మొదలయ్యాయని స్తానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధ వాతావరణంతో చాలా గ్రామాల్లో ముందుగానే గోధుమ పంటలు కోసిన పరిస్థితి. ఇక వేర్వేరు రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం అక్కడికెళ్లిన కూలీల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. కాల్పుల శబ్దాలతో ఉలిక్కిపడుతూ.. ఇక్కడ ఉండలేమంటూ వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో దిక్కుతోచని పాక్ బలగాలు.. పూంచ్, తంగ్దర్ సెక్టార్ల దగ్గర సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా కాల్పులకి పాల్పడుతున్నాయి. అలాగే ఎల్ఓసీ వెంట ఫైరింగ్ చేస్తుండటంతో చాలామంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ కాల్పుల్లో పాకిస్తాన్తో పోరాడుతున్నప్పుడు ఒక భారతీయ సైనికుడు అమరవీరుడు అయ్యాడు. భారత సైన్యం 16 కార్ప్స్ అధికారిక X ఖాతా బుధవారం రాత్రి ధృవీకరించింది. మే 7న పాకిస్తాన్ సైన్యం జరిపిన షెల్లింగ్ సమయంలో అమరుడైన 5 FD రెజిమెంట్కు చెందిన L/NK దినేష్ కుమార్ అత్యున్నత త్యాగానికి GOC, వైట్ నైట్ కార్ప్స్ అన్ని ర్యాంకులు సెల్యూట్ చేస్తున్నాయని భారత సైన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూంచ్ సెక్టార్లో అమాయక పౌరులపై జరిగిన లక్షిత దాడుల బాధితులందరికీ సంఘీభావం తెలియజేసింది భారత ఆర్మీ.
#GOC and all ranks of #WhiteKnightCorps salute the supreme sacrifice of L/Nk Dinesh Kumar of 5 Fd Regt, who laid down his life on 07 May 25 during Pakistan Army shelling.We also stand in solidarity with all victims of the targeted attacks on innocent civilians in #Poonch Sector.…
— White Knight Corps (@Whiteknight_IA) May 7, 2025
ఆపరేషన్ సింధూర్తో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది తట్టుకోలేక, జీర్ణించుకోలేక.. పాక్ సైనికులు సామాన్యులపై దాడులు చేస్తున్నారు. వరుస ఘటనలపై భారత బలగాలు తీవ్రంగా స్పందించాయి. దుర్మార్గమైన చర్యలకు త్వరలోనే గట్టిగా బదులిస్తామని పాక్ సైన్యాన్ని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే సాధారణ భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకుంది. బుధవారం పాకిస్తాన్ దళాలు ఎల్ఓసీ వెంబడి డజన్ల కొద్దీ గ్రామాలపై ఫిరంగి, మోర్టార్ షెల్స్తో కాల్పులు జరపడంతో 12 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. అయితే, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. ప్రతీకారంగా సైన్యం అనేక శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులు సరిహద్దు నివాసితులలో భయాందోళనలకు కారణమయ్యాయి. స్థానికులు బంకర్లలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. వారి గ్రామాల లోపల-వెలుపల సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..