ED Notice: ఇద్దరు కీలక నేతలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. విచారణకు రావాలని ఆదేశం..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వీ డిసెంబర్ 22న, లాలూ డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వీ డిసెంబర్ 22న, లాలూ డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ జూలైలో రెండో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్లు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న కోర్టు.. అక్టోబర్లో వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇది లాలూపై రెండవ ఛార్జిషీట్ కాగా అతని కుమారుడు తేజస్వి యాదవ్కు మొదటి ఛార్జిషీట్. ఈ ఛార్జిషీట్లో తేజస్వి యాదవ్ ను నిందితుడిగా పేర్కొంది ఈడి.
అయితే 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా తనకు అనుకూలమైన వారిని రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించారని, పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. క్విడ్ ప్రోకో కింద కేసులు నమోదు చేసింది. ఉద్యోగార్థుల నుంచి లాలూ కుటుంబం తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు దాఖలు చేసింది. ఈ క్రమంలో సీబీఐ గత ఏడాది మేలో లాలూ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. దీనిపై కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. బెయిల్ మంజూరు చేసిన రెండు నెలల తరువాత తిరిగి లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో లాలూ, భార్య రబ్రీ దేవి, అతని కుమారుడు తేజస్వి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్ ను నిందితులుగా పేర్కొంది. వీరితో సహా మరో 17 మందిని పేర్లను నిందితులుగా పేర్కొంది. మరి విచారణకు హాజరవుతారా.. లేక నోటీసులను బేఖాతరు చేస్తారా వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..