DGCA: రిపీట్ చేస్తే తాటతీస్తాం.. డీజీసీఏ సీరియస్ వార్నింగ్
విమానాల్లో సాంకేతిక లోపాలు, ఎయిర్పోర్ట్ల్లో భద్రతా ప్రమాణాల వైఫల్యంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో లోపాలను సరిచేసుకోవాలని , లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్బాక్స్ను భారత్ లోనే డీకోడ్ చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

దేశంలోని విమానయాన సంస్థలకు డీజీసీఏ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మేజర్ విమానాశ్రయాలు, విమానయాన సంస్థల్లో సేఫ్టీ సర్వే నిర్వహించింది డీజీసీఏ. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో పగలు, రాత్రి ఆపరేషన్ల పరిశీలించారు. లోపాలు పదే పదే పునరావృతమవుతున్నాయని, గ్రౌండ్ హ్యాండ్లింగ్ పరికరాలు కూడా పనిచేయని స్థితిలో ఉన్నాయని గుర్తించారు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటనెన్స్లో భద్రతాపరమైన లోపాలున్నాయని డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రన్-వే మీద మధ్యలో ఉండాల్సిన లైన్ మార్కింగ్ వెలిసిపోయి, చెదిరిపోయి ఉన్నట్టు తెలిపింది.
ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవే, గ్రీన్ సెంటర్ లైట్ ఒకే డైరక్షన్లో లేవని వెల్లడించింది. చాలాసార్లు గుర్తించిన లోపాలే మళ్లీ మళ్లీ పునరావృతం అయ్యాయని మండిపడింది. దీన్ని బట్టి లోపాలను సరిదిద్దే ప్రక్రియ సజావుగా సాగడం లేదని తెలిపింది. అరిగిపోయిన టైర్లతో నడుస్తున్న షెడ్యూల్డ్ విమానాన్ని టైర్లు మార్చిన తర్వాత విడుదల చేసినట్టు తెలిపింది. గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు ఆపరేటర్లకు 7 రోజుల గడువు ఇచ్చింది. డీజీసీఏ సేఫ్టీ సర్వే తరువాత కీలక నివేదికను విడుదల చేసింది.
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బ్లాక్బాక్స్ను విదేశాలకు పరీక్షల కోసం తరలించడం లేదని కేంద్రం స్పష్టం చేశారు. భారత్ లోనే బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 256 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షతో గుర్తించి బంధువులకు అందచేశారు. 28 మృతదేహాలను దేశం లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు అందచేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పార్లమెంటరీ కమిటీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది.