AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demonetisation: అందుకే పెద్ద నోట్ల రద్దు.. సుప్రీంకోర్టుకు కేంద్రం ఏమని చెప్పిందంటే..?

2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. అలాంటి కీలక నిర్ణయాల్లో ఒకటి.. కరెన్సీ నోట్ల రద్దు..

Demonetisation: అందుకే పెద్ద నోట్ల రద్దు.. సుప్రీంకోర్టుకు కేంద్రం ఏమని చెప్పిందంటే..?
Demonetisation
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2022 | 12:58 PM

Share

2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. అలాంటి కీలక నిర్ణయాల్లో ఒకటి.. కరెన్సీ నోట్ల రద్దు.. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలను సమర్పించింది. నోట్ల రద్దు అనేది మంచిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.. ఇది నల్లధనాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగమంటూ కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఈ చర్యను సమర్థిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నామని.. దీనికోసం ముందస్తు సన్నాహాలు చేశామని కేంద్రం వెల్లడించింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు నల్లధనం/ నకిలీ కరెన్సీని అరికట్టేందుకు, డిజిటల్ చెల్లింపులను విస్తృత స్థాయిలో పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నోట్ల రద్దు ఆర్థిక విధాన నిర్ణయమని అఫిడవిట్‌లో పేర్కొంది.

ఆర్థిక వృద్ధిపై ఈ చర్య మొత్తం ప్రభావం అస్థిరంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవ వృద్ధి రేటు FY2016-17 సంవత్సరంలో 8.2% ఉందని.. FY 17-18లో 6.8% ఉందని తెలిపింది. కరోనా మహమ్మారి కంటే.. ముందు ఈ సంవత్సరాల్లో 6.6% దశాబ్ధ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా.. నోట్ల రద్దు గురించి దాఖలైన పిటీషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై సమగ్ర అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్రాన్ని, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను అక్టోబర్ 12న ఆదేశించింది.

జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కూడా కేంద్రం ఆర్‌బిఐకి నవంబర్ 7, 2016న పంపిన లేఖకు సంబంధించిన ఫైళ్లను సిద్ధంగా ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరుసటి రోజు RBI బోర్డు తీసుకున్న నిర్ణయం, వెంటనే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వంటి అంశాలకు సంబంధించిన వాటిని కూడా సమర్పించాలని పేర్కొంది.

నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన దాదాపు 60 పిటిషన్లను ధర్మాసనం పరిశీలిస్తోంది. భవిష్యత్తులో కూడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని.. ఏదోఒక విషయంలో సమాధానం ఇవ్వడం విధి అని, దీనికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని సుప్రీం మౌఖికంగా వ్యాఖ్యానించింది.

గత విచారణ సందర్భంగా (నవంబర్ 9న), నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పునిచ్చేందుకు రాజ్యాంగ ధర్మాసనం సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్రం కోరిన వాయిదాపై సుప్రీంకోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో ఈ కేసు మళ్లీ విచారణకు రానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..