Narayan Rane: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టు షాక్.. రెండు వారాల్లో చర్యలకు ఆదేశాలు..
నారాయణ్ రాణే ఆధిష్ బంగ్లా నిర్మాణం అక్రమమని.. బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల్లోగా ఈ బంగ్లాను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది.
Narayan Rane’s House: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నారాయణ్ రాణే ఆధిష్ బంగ్లా నిర్మాణం అక్రమమని.. బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల్లోగా ఈ బంగ్లాను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రాణేకు పది లక్షల రూపాయల జరిమానా సైతం విధించింది. FSI, CRZలను ఉల్లంఘించారని.. రాణేపై ఆరోపణలు వచ్చాయి. ఈ బంగ్లాలో అక్రమ నిర్మాణం కోసం చేసిన దరఖాస్తును మున్సిపాల్టీ పరిగణించరాదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ముంబై- జుహులోని సముద్రం పక్కనే ఈ బంగ్లా ఉంది. దీనిపై సంతోష్ దౌండ్కర్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నారాయణ్ రాణేకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ బంగ్లాను మున్సిపల్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ టైంలో బిజేపీ, శివసేన మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదిలా ఉండగా.. బంగ్లా నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలంటూ దాఖలైన మొదటి దరఖాస్తును తిరస్కరించారు అధికారులు. ఇదే డిమాండ్ తో రెండో సారి కూడా దరఖాస్తు చేసుకున్నా.. వ్యతిరేకించక పోవడంపై మున్సిపల్ కార్పొరేషన్ వైఖరిపై హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఈ నిర్మాణాన్ని అక్రమంగా గుర్తించి క్రమబద్దీకరించడానికి నిరాకరించింది.
రాణే తన పార్టీ మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షను అక్టోబర్ 15, 2019న భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. ఆ సంవత్సరం మహారాష్ట్రలో జరిగిన శాసనసభ ఎన్నికల తరువాత, BJP-సేన కూటమి పూర్తిగా విచ్ఛిన్నమైంది. జూలై 2021 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో, మోడీ రాణేను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా నియమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి