AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు

ఇండో చైనా సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాంగాంగ్‌ సమీపంలో చైనా ఆర్మీ యుద్దవిన్యాసాలు చేస్తోంది. సరిహద్దుకు కేవలం అర కిలోమీటర్‌ దూరంలో చైనా సైన్యం విన్యాసాలు ప్రదర్శిస్తోంది.

భారత సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 6:57 PM

Share

ఇండో చైనా సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాంగాంగ్‌ సమీపంలో చైనా ఆర్మీ యుద్దవిన్యాసాలు చేస్తోంది. సరిహద్దుకు కేవలం అర కిలోమీటర్‌ దూరంలో చైనా సైన్యం విన్యాసాలు ప్రదర్శిస్తోంది. యుద్దం సమయంలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలన్న విషయంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది. లద్దాఖ్‌కు అత్యంత సమీపంలో కూడా యుద్ద విమానాలను మోహరించింది. H-6 బాంబర్లను రంగంలోకి దింపింది. అణుబాంబులను జారవిడిచే ఫైటర్‌ జెట్‌లను కూడా యుద్ద విన్యాసాల్లో ఉపయోగించి భారత్‌ను బెదిరించే ప్రయత్నం చైనా చేస్తోంది.

అయితే.. లద్దాఖ్‌లో హై అలర్ట్‌లో ఉన్న భారత బలగాలు చైనా కవ్వింపులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. చైనాకు దీటుగా ముందస్తుగా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. సుఖోయ్‌, మిగ్‌ విమానాలను భారత్‌ సరిహద్దులో మోహరించింది. ఇప్పుడు వైమానిక దళంలోకి రాఫెల్ జెట్ యుద్ధవిమానాలు చేరుతున్నాయి.

ఎల్‌ఏసీ దగ్గర చైనా తీరుతో యుద్దవాతావరణం కన్పిస్తోంది. పాంగాంగ్‌ వైపు చైనా భారీగా బలగాలను తరలిస్తోంది. అటు ఫింగర్‌-3 సమీపంలో కొత్త స్థావరాలు నిర్మించే పని వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది సైనికులను సరిహద్దుల దగ్గర మోహరించినట్టు సమాచారం. 150 యుద్ధ విమానాలు, ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను బోర్డర్‌కు చైనా తరలించింది.

అయితే.. వ్యూహాత్మక ప్రాంతాల్లో మాత్రం భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎత్తైన కొండలపై మన సైన్యం డేగకళ్లతో నిఘా వేసింది. వాయు మార్గంలో కూడా పెట్రోలింగ్ కొనసాగిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. రాఫెల్ జెట్లు కూడా వాళ్లకు అండగా ఉండబోతున్నాయి.

చైనా చెప్పేది ఒకటి, చేసేది మరోటి. చైనా కుతంత్రాలను గ్రహించిన భారత్, అందుకు తగ్గట్టే సన్నాహాలు చేసుకుంది. సరిహద్దుల్లో అదనపు సైన్యాన్ని మోహరించింది. సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. రెజాంగ్‌ లా దగ్గర 5 వేల మీటర్ల ఎత్తున భారత్‌ శిబిరాలున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని భారత సైన్యం విస్పష్ట సంకేతాలిచ్చింది. లద్దాఖ్‌లో భారీగా ఐటీబీపీ బలగాలను కూడా మోహరించారు. లేహ్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

రష్యా రాజధాని మాస్కోలో ఎస్ సీఓ సదస్సు సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ భేటీ కానున్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చైనా కోరింది. కాని చర్చలంటూనే చైనా బలగాలు మోసానికి పాల్పడుతున్నాయి. చైనా తీరును ఎప్పటికప్పుడు భారత్ గట్టిగా నిలదీస్తోంది.

నేడు జరగనున్న భేటీలో చైనా కవ్వింపు చర్యలపై ఆ దేశా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ను భారత విదేశాంగశాఖ మంత్రి జైశకంర్ నిలదీయబోతున్నారు. సరిహద్దుల్లో ఎవరైనా హద్దులు దాటితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దమని భారత్ ఇప్పటికే ప్రకటించింది.