పాక్ సైన్యం పైశాచికం.. కాబూల్లో ఆస్పత్రిపై దాడి.. 400 మంది మృతి..
ప్రపంచం ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలతో అల్లాడుతుంటే, ఇప్పుడు ఆసియా గడ్డపై మరో భీకర రక్తం చిందుతోంది. దశాబ్దాలుగా అస్థిరతకు నిలయమైన పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కట్టలు తెంచుకున్నాయి. కాబూల్లోని ఓ ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడిలో వందలాది ప్రాణాలు గాల్లో కలవడం మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.

ఇప్పటికే ఇరాన్ – ఇజ్రాయెల్-అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణంతో ప్రపంచం అల్లాడుతుంటే.. ఇప్పుడు ఆసియా ఖండంలో మరో రణరంగం మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్లోని ఒక ఆసుపత్రిపై జరిపిన దాడిలో సుమారు 400 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ తెలిపిన వివరాల ప్రకారం.. కాబూల్లోని డ్రగ్స్ రిహబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం బాంబు దాడికి తెగబడింది. ఈ దాడిలో 400 మంది పౌరులు మరణించగా.. మరో 250 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. బాంబు దాడి ధాటికి ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఖండించిన పాకిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తోసిపుచ్చింది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, పౌర స్థావరాలపై లేదా ఆసుపత్రులపై ఎటువంటి దాడులు చేయలేదని పాక్ అధికారులు వాదిస్తున్నారు. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో చేపట్టిన ఆపరేషన్లో ఎటువంటి పౌర నష్టం జరగలేదని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది.
ముదురుతున్న వైరం: అసలు ఏం జరుగుతోంది?
గత ఫిబ్రవరి 22 నుండి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారనే సాకుతో పాకిస్తాన్ నిరంతరం వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఒకే వారంలో ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన రెండో అతిపెద్ద దాడి ఇది. తాలిబన్ సైన్యం కూడా సరిహద్దు వెంబడి ఉన్న పాక్ సైనిక పోస్టులపై ఎదురుదాడికి దిగుతోంది. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితి వల్ల వేలాది మంది ప్రజలు సరిహద్దు గ్రామాల నుండి వలస వెళ్తున్నారు.
ప్రపంచంపై దీని ప్రభావం ఏమిటి?
ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా చమురు ధరలు, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధం మొదలైతే, అది దక్షిణ ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తాలిబన్లు ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
