Punjab New CM: పంజాబ్ కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు సుఖ్జిందర్ సింగ్ రంధావాను ముఖ్యమంత్రిగా ఫైనల్ చేశారని వార్తలొచ్చాయి. కానీ రావత్ ట్వీట్తో సందిగ్ధం వీడింది. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. చరణ్జీత్ ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ను కలిసి లేఖ అందించనున్నారు హరీశ్ రావత్. సాయంత్రం 6:30 గంటలకు ఈ భేటీ జరగనుంది.
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021
సీఎం పదవికి అమరీందర్సింగ్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అనంతరం కాంగ్రెస్ శాననసభా పక్ష భేటీ జరిగింది. రెండు కీలక తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించారు. కొత్త సీఎంను ఎంపిక చేసే నిర్ణయాన్ని సోనియాగాంధీకి వదిలేస్తూ మొదటి తీర్మానం చేశారు. తరువాత పంజాబ్లో అమరీందర్సింగ్ చక్కని పాలన అందించారని రెండో తీర్మానం చేశారు. అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమరీందర్సింగ్ . తనకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరీందర్ను తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానం పలికింది. మూడుసార్లు తనకు ఇలాగే అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అమరీందర్. హైకమాండ్ నచ్చినవాళ్లకు సీఎం పదవి ఇచ్చుకోవచ్చన్నారు. సోనియాతో మాట్లాడిన తరువాతే రాజీనామా చేసినట్టు చెప్పారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని , తనముందు చాలా మార్గాలున్నాయని తెలిపారు అమరీందర్సింగ్.
కెప్టెన్ అమరీందర్సింగ్ , పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ పదవి ఊడింది. అంతకుముందు అమరీందర్ తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాజీనామా అనంతరం తన పదవికి ఎసరుపెట్టిన పీసీసీ చీఫ్ సిద్దూపై విరుచుకుపడ్డారు అమరీందర్సింగ్. సిద్దూ పంజాబ్ సీఎం అయితే వినాశనమే అని హెచ్చరించారు. సీఎంగా ఆయన్ను తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. సిద్దూకు పాకిస్తాన్ పీఎంతో , ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని , ఇది దేశభద్రతకు పెనుముప్పుగా మారుతుందని హెచ్చరించారు.