By Elections: ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ? ఎవరెవరు? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఫలితాలు..
నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ..పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి.
By Elections: నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ..పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మరి ఆ ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగాయి? ఏ పార్టీ గెలిచింది వివరాలు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట పార్లమెంట్ స్థానానికీ, ఇంకో చోట అసెంబ్లీ స్థానానికీ ఉప ఎన్నిక జరిగింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి విజయం సాధించగా.. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ గెలిచారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేరళలోని మలప్పురం స్థానంలో ఇండియన్ ముస్లింలీగ్ అభ్యర్థి అబ్దుస్సమద్ సమదానీ, కర్ణాటకలోని బెళగావిలో బీజేపీ అభ్యర్థి మంగళ విజయం సాధించారు. తమిళనాడులోని కన్యాకుమారి స్థానంలో కాంగ్రెస్ నేత విజయవసంత్ విజయం సాధించారు.
ఇక వివిధ రాష్ట్రాలలోని శాసనసభా నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. 10 రాష్ట్రాల్లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు.
- కర్ణాటక: ఇక్కడ బసవకల్యాణ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి శరణ సలగర్, మస్కి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ గెలుపొందారు.
- గుజరాత్: పంచమహల్ జిల్లా మోర్వా హదఫ్ అసెంబ్లీ స్థానంలో భాజపా నేత నిమిశా సుథర్ గెలిచారు.
- రాజస్థాన్: రాజసమంద్ స్థానాన్ని భాజపా అభ్యర్థి దీప్తి కిరణ్ మహేశ్వరి గెలుచుకున్నారు. సహద, సుజన్గఢ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గాయత్రి త్రివేది, మనోజ్కుమార్ విజయం సాధించారు.
- మధ్యప్రదేశ్: దామోహ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్కుమార్ టాండన్ గెలిచారు.
- మహారాష్ట్ర: పండర్పుర్-మంగల్వేద స్థానంలో భాజపా అభ్యర్థి సమాధాన్ మహాదేవ్ విజయం సాధించారు.
- ఉత్తరాఖండ్: సల్ట్ స్థానంలో భాజపా తరఫున పోటీ చేసిన మహేశ్ జీనా గెలుపొందారు.
- ఝార్ఖండ్: మధుపుర్ స్థానంలో జేఎంఎం అభ్యర్థి హఫిజుల్ హుస్సేన్ జయకేతనం ఎగురవేశారు.
- మిజోరం: సెర్ఛిప్ నుంచి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) అభ్యర్థి లాల్డుహోమా గెలిచారు.
- ఒడిశా: పిపిలీ స్థానంలో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థి నొక్సెన్ ఏకగ్రీవమయ్యారు.