Assembly Results: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు జరిగిందా? అసలు అవి ఏం చెప్పాయి? ఏం జరిగింది? ఏ రాష్ట్రంలో ఫలితాలు ఎలా?
దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సుదీర్ఘ ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి సవాలుగా మారాయి.
Assembly Results: దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సుదీర్ఘ ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి సవాలుగా మారాయి. వెస్ట్ బెంగాల్ లో తన రాజకీయ శత్రువు మమతా బెనర్జీని ఓడించడం.. ఇటు దక్షిణాదిన ఎలాగైనా పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకోవడం లక్ష్యాలుగా బీజేపీ ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపధ్యంలో ఎన్నికలు అన్నిరాష్ట్రాల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. ఈ ఎన్నికల నేపధ్యంలో పలు సంస్థలు ఓటర్ల నాడిని ఒడిసిపట్టడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆ సంస్థలు ఫలితాలకు రెండు రోజుల ముందు తమ అంచనాలను వెల్లడించాయి. మరి ఆయా సంస్థలు చెప్పినట్టుగా జరిగిందా? అంచనాలు ఎలా ఉన్నాయి? అసలు ఫలితాలు ఏమిటీ ఒకసారి పరిశీలిస్తే..
పశ్చిమ బెంగాల్..ఘోర విఫలం..
బెంగాల్లో ప్రజల నాడిని పసిగట్టడంలో సర్వే సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. మొదటి నుంచీ ఇక్కడ ఎన్నికలు టీఎంసీ-బీజేపీ మధ్య హోరా హోరీగా జరుగుతాయని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వరకూ ఖాయమే కానీ, మేజిక్ ఫిగర్ కంటె ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం లేదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. కానీ, 215 స్థానాలతో ఏకపక్ష విజయం సాధించింది మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ. ఇక తన పార్టీని ఘన విజయం వైపు నడిపించిన మమతా బెనర్జీ తాను స్వయంగా నందిగ్రామ్ లో ఓటమి పాలవ్వడం విశేషం.
తమిళనాడు..డీఎంకే గెలుపు..
అత్యధిక సర్వేలు డీఎంకే ఘన విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, ఆ పార్టీకి బొటాబొటి మెజారిటీనే దక్కింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే కు 160-190 స్థానాలు వస్తాయని చెప్పాయి. అయితే, 131 చోట్లే విజయం దక్కింది ఆ పార్టీకి. ఇక్కడ అన్నా డీఎంకే కూడా దాదాపు 70 స్థానాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.
కేరళ..వాస్తవాల్ని ప్రతిబింబించాయి..
కేరళలో ఎగ్జిట్ పోల్స్ కొంత వరకూ వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. ఎల్డీఎఫ్ 72-100 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు జోస్యం చెప్పాయి. ఇక్కడ ఎల్డీఎఫ్ 84 స్థానాలు సాధించగా యూడీఎఫ్ 44 స్థానాలతో సరిపెట్టుకుంది
అస్సాం..ఇక్కడా దగ్గర దగ్గరగా..
అస్సాం ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకూ వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. అస్సాంలో బీజేపీ కూటమి 62-80 స్థానాలు సాధిస్తుందని చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక్కడ బీజేపీ కూటమి 71 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ కూటమి 46 స్థానాలు సాధించింది.
పుదుచ్చేరి..కొంతవరకూ..
పుదుచ్చేరిలో ఎన్డీఏ స్పష్టమైన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ, మొత్తం 30 స్థానాలకుగాను అతి కష్టం మీద 16 స్థానాలతో మెజారిటీ మార్కుకు ఎన్డీఏ కూటమి చేరుకోగలిగింది.