Supreme Court: పురుషుల గోడు చెప్పుకునేందుకు జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలి
దేశంలో పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పెండ్లి అయిన మగవాళ్లు కూడా గృహహింసకు గురవుతూ, కుటుంబసమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారు తమ గోడును చెప్పుకుని న్యాయం పొందేందుకు వీలుగా ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ను ఏర్పాటు చేయాలని కోరారు.

దేశంలో పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పెండ్లి అయిన మగవాళ్లు కూడా గృహహింసకు గురవుతూ, కుటుంబసమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారు తమ గోడును చెప్పుకుని న్యాయం పొందేందుకు వీలుగా ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను మహేశ్కుమార్ తివారీ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఎంతోమంది పెళ్లైన పురుషులు గృహహింస భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆ సమస్యపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-2021 రిపోర్టును కూడా పిటిషన్కు జత చేశారు పిటిషనర్ మహేశ్కుమార్. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 1లక్షా 64వేల 33 మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
వారిలో 1లక్షా 18వేల979 మంది పురుషులు కాగా.. 45వేల26 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అందులో.. 81వేల 63 మంది పెండ్లి అయిన పురుషులు కాగా.. 28వేల680 మంది వివాహిత మహిళలని వివరించారు. ఈ రిపోర్ట్లోని డేటా ప్రకారం 2021లో 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా.. 4.8 శాతం మంది పురుషులు వివాహ సంబంధిత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు.. గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం తగు సూచనలు చేయాలన్నారు. జాతీయ పురుషుల కమిషన్ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇక.. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇద్దరు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విచారించనుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
