Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌‌లో 8 మంది మృతి

కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చనిపోయినవారిలో అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌‌లో 8 మంది మృతి
Security Force
Follow us
G Koteswara Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2025 | 9:21 PM

ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ బలగాలు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. శనివారం ఉదయం 8.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ కొన్ని గంటల పాటు సాగింది. బస్తర్‌ రేంజ్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఘటనాస్థలంలో ఆటోమేటిక్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఏడాదిలో మావోయిస్టుల ఏరివేత చురుగ్గా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. జనవరి 5న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌, అదే నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇక జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు చనిపోయారు. జనవరి 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 16మంది నక్సల్స్‌ హతమయ్యారు. జనవరి 29న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్‌ చనిపోయారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మరికొందరు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కలిపి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 48మంది మావోయిస్టులు హతమయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..