Sputnik V: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మే 1న భారత్ లో అందుబాటులోకి..వెల్లడించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌

మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవీ షీల్డ్ టీకాలకు తోడుగా రష్యా నుంచి స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

Sputnik V: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మే 1న భారత్ లో అందుబాటులోకి..వెల్లడించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌
Sputnik V
Follow us

|

Updated on: Apr 27, 2021 | 5:34 PM

Sputnik V: కరోనా పై పోరాటంలో చివరి అస్త్రంగా భావిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో అందరికీ అందించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మెల్లగా ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవీ షీల్డ్ టీకాలకు తోడుగా రష్యా నుంచి స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడు రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ అతి త్వరలో దేశానికి రానుంది. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు సోమవారం చెప్పారు. అయితే, తొలి కన్‌సైన్‌మెంట్‌లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టతనివ్వలేదు. ‘‘మే 1వ తేదీన తొలి డోసులు భారత్‌కు డెలివరీ అవుతాయి’’ అని ఆయన తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్‌ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్‌ ఫలితాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.

కాగా, మరోపక్క దేశంలో  కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2771 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 (1.76 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,97,894 కి చేరింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. నిన్నటితో పోల్చుకుంటే.. కరోనా కేసులు, మరణాల సంఖ్య కొంతమేర తగ్గింది.

Also Read: Vaccination: ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి టీకా అప్పుడే కాదు.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Biological E: హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్.. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి