AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..!

తెలంగాణ మట్టిలో పుట్టిన ఉపాధ్యాయుడి కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథకు పక్క రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది. నాణ్యమైన సాహిత్యానికి, చిన్నారులను ఆకట్టుకునే సృజనాత్మకతకు భాషా భేదాలు అడ్డుకావని నిరూపిస్తూ.. పొరుగు రాష్ట్ర విద్యాశాఖ ఈ కథను తమ పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేలాది మంది పాఠశాల విద్యార్థులు మన తెలంగాణ గురువు రాసిన అమృతమైన కథను చదువుకోబోతున్నారు.

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..!
Teacher Achievement
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 8:21 PM

Share

తెలుగు నేల సృజనకు సరిహద్దులు లేవు.. మన అక్షరాల పరిమళం ఎల్లలు దాటుతోంది. మన తెలుగు బాల సాహిత్యం ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లోనూ సగర్వంగా వీస్తోంది. ​తెలంగాణ మట్టిలో పుట్టిన ఉపాధ్యాయుడి కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథకు పక్క రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది. నాణ్యమైన సాహిత్యానికి, చిన్నారులను ఆకట్టుకునే సృజనాత్మకతకు భాషా భేదాలు అడ్డుకావని నిరూపిస్తూ.. పొరుగు రాష్ట్ర విద్యాశాఖ ఈ కథను తమ పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేలాది మంది పాఠశాల విద్యార్థులు మన తెలంగాణ గురువు రాసిన అమృతమైన కథను చదువుకోబోతున్నారు.

న‌ల్లగొండ జిల్లా డిండి మండలం కామేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా వడ్డేపల్లి వెంకటేష్ పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా బాల సాహిత్య రంగంలో సేవలందిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ నిరంతరం కథలు, గేయాలు, పాటలు రాయడంతో పాటు కార్టూన్లు గీస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా సులభమైన భాషలో కథలు రాయడం, కార్టూన్లు గీయడం ఆయన ప్రత్యేకత. చిన్నారులకు సులభతరంగా అర్థమయ్యే కథనాలు, విజ్ఞానాన్ని అందించడంతో పాటు నైతిక విలువలు నేర్పేలా బాలసాహిత్యాన్ని అందిస్తున్నారు. వెంకటేష్.. చిన్నారుల కోసం పిల్లల జాబిల్లి పేరుతో కథా సంకలనం రూపొందించారు. ఇందులోని తిమ్మప్ప- మామిడి టెంక కథ.. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఈ కథ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది.

రెండేళ్ల క్రితం మహారాష్ట్ర పాఠ్యాంశాల ఎంపిక కమిటీ.. వెంకటేష్ రాసిన బాల సాహిత్యం, పుస్తకాలను పరిశీలించింది. ముఖ్యంగా వెంకటేష్ రాసిన ‘ పిల్లల జాబిల్లి’ బాల కథల సంపుటిని పరిశీలించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, తెలుగు భాషను అభ్యసిస్తున్న అక్కడి మూడో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ‘బాలభారతి’ పాఠ్య పుస్తకంలో తిమ్మప్ప-మామాడి టెంక కథనాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చింది.

ఇవి కూడా చదవండి

తన కథను మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా ఆనందాన్ని కలిగిందని వడ్డేపల్లి వెంకటేష్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక స్టేట్ బ్యూరో వారు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసారని ఆయన చెప్పారు. కథకు నగదుతో పాటు రాయల్టీ కూడా ఇచ్చారని వెంకటేష్ తెలిపారు. మరిన్ని అర్థవంతమైన, పిల్లలకు ఆసక్తికరమైన, నైతిక విలువలు నేర్పే బాలల కథలను మరిన్ని రాస్తానని వెంకటేష్ చెప్పారు.

ఇటీవలే నల్లగొండకు చెందిన బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాల గేయ సంపుటిలోని కంప్యూటర్ పిల్లలం’ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా చేర్చింది. దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు, వడ్డేపల్లి వెంకటేష్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిల సృజనాత్మకతకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us