పోస్టల్ బ్యాలెట్ లిస్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ
రాష్ట్రంలో కరోనా ప్రభావిత సమయంలో ఎన్నికల జరుగుతున్నందున ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది
రాష్ట్రంలో కరోనా ప్రభావిత సమయంలో ఎన్నికల జరుగుతున్నందున ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికలలో 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. పారదర్శకంగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వృద్ధులకు, వికలాంగులకు అధికార పార్టీకి ఓట వేసేలా చూస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై ఆయా పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో మొత్తం 1,98,807 ఓటర్లు ఉండగా, అందులో 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 1,089, వికలాంగులు 469 మొత్తం 1,558 మందిని గుర్తించినట్లు అధికారులు తేల్చారు. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు.
పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ తీరుపై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారి ఇండ్లలోకి వెళ్లిన ఎన్నికల అధికారులు ఓట్లు వేయిస్తునర్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ విధానంలో వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నాగానీ అధికారులు దానిని పాటించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం అధికారులను అడ్డుకుంటున్న ఆయా పార్టీల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందని, ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు.
అయితే, దీనిపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు. తాము ఎన్నికల అధికారులమని, ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని, కేవలం ఓటు ఎలా వేయాలో మాత్రమే తెలుపుతున్నామంటూ అధికారులు నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల వాదనలతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించకుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే మూడు వర్గాల ఓటర్ల జాబితాను తమకు ఇవ్వలేదని కాంగ్రెస్ చెప్పగా, కొంతమంది అధికారులు అర్హత కలిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు వెళ్లేముందు అయా పార్టీకి సమాచారం ఇవ్వడం లేదని బిజెపి తెలిపింది.
అయితే, అయితే మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీలకు పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థుల జాబితాను అందించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి భారతి హోలికేరి చెప్పారు. దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో 1,558 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను షీల్డ్ కవర్ లో స్వీకరించేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు 15 టీములు ఏర్పాటు చేశాం. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయించుటకు మొదటి విడతగా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు, రెండో విడతలో ఈ నెల 31 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఓటర్ల ఇళ్లను సందర్శించి ఓటు వేయించేందుకు నిర్ణయించాం. అధికారులు ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించరు. పోస్టల్ బ్యాలెట్ విధానానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలి.