సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతోన్న ఐపీఎల్‌ ప్రీ క్లయిమాక్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రీ క్లయిమాక్స్‌కు వచ్చేసినా .. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.. బహుశా ఐపీఎల్‌ పట్ల అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరగడానికి ఇదే కారణం కావచ్చు..

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతోన్న ఐపీఎల్‌ ప్రీ క్లయిమాక్స్‌
Follow us

|

Updated on: Oct 30, 2020 | 2:17 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రీ క్లయిమాక్స్‌కు వచ్చేసినా .. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.. బహుశా ఐపీఎల్‌ పట్ల అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరగడానికి ఇదే కారణం కావచ్చు.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌. మొదటి నుంచి ఆ జట్టు నిలకడగా ఆడుతూ విజయాలు సాధిస్తూ వచ్చింది.. ముంబాయి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం గ్యారంటీ అని ఐపీఎల్‌ ఇంటర్వెల్‌లోనే తెలిసిపోయింది.. బుధవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్‌ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్‌పై కర్చిఫ్‌ వేసింది.. నిన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించడంతో ముంబాయి ఇండియన్స్‌ డైరెక్ట్‌గా ప్లే ఆఫ్‌కు చేరుకుంది.. నిరుడు రన్నరప్‌గా ఉన్న చెన్నై జట్టు ఈసారి ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కాకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబాయి టాప్‌ ప్లేస్‌లో ఉంది.. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ కూడా గొప్పగానే ఉంది.. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తోనూ ఆడాల్సి ఉంది.. మరోవైపు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతాకు 12 పాయింట్లు ఉన్నాయి.. కాకపోతే నెట్‌రన్‌రేటే బాగోలేదు.. ఇదే ఆ టీమ్‌ను బాధిస్తున్న అంశం. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ భారీ తేడాతో విజయాన్ని అందుకోవాలి.. అలా జరిగితేనే ప్లే ఆఫ్‌ రేసులో నిలబడుతుంది.. లేకపోతే లేదు.. కింగ్స్‌ పంజాబ్‌ టీమ్‌కు ప్లే ఆఫ్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.. పంజాబ్‌ టీమ్‌ ఇక్కడి వరకు వస్తుందని ఎవరూ అనుకోలేదు.. కారణంగా ఆరంభ మ్యాచ్‌లలో ఆ జట్టు ప్రదర్శన అలా ఉండింది.. ఎప్పుడైతే క్రిస్‌ గేల్‌ ఫైనల్‌ ఎలెవన్‌లోకి వచ్చాడో అప్పటి నుంచి పంజాబ్‌ జాతకం మారిపోయింది.. వరుసగా అయిదు మ్యాచ్‌లలో విజయం సాధించి ఈ స్థాయికి చేరుకుంది.. మొత్తం 12 పాయింట్లతో టేబుల్‌లో ఉంది.. ఈ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయి.. రాజస్తాన్‌ రాయల్స్‌తోనూ, చెన్నై సూపర్‌ కింగ్స్‌తోనూ ఆడాల్సి ఉంది.. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే రన్‌రేట్‌తో ప్రమేయం లేకుండానే ప్లే ఆఫ్‌కు వెళుతుంది. ఏ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది కానీ.. అప్పుడు మిగిలిన జట్ల గెలుపోటమలపై ఆధారపడాల్సి వస్తుంది.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్‌ పంజాబ్‌ రన్‌రేట్‌ బాగోలేదు కానీ నాలుగో స్థానం కోసం ఈ రెండు జట్ల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. రాజస్తాన్‌ రాయల్స్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి పది పాయింట్లతో ఉన్న రాజస్తాన్‌ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.. కింగ్స్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీపడాల్సి ఉంది.. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించినా నెట్‌ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది.. రాజస్తాన్‌ ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే కింగ్స్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ గెలవాలి.. అదే సమయంలో హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి.. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కూడా ప్లే ఆఫ్‌ అవకాశాలున్నాయి.. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 14 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. మిగతా రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది.. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లలో ఓడినా బెంగళూరు ప్లే ఆఫ్‌కు వెళ్లవచ్చు.. కాకపోతే అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది.. ఈ సీజన్‌ మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజృంభించేసింది.. ప్లే ఆఫ్‌కు అలవోకగా చేరుకుటుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 14 పాయింట్లతో ఉంది.. నెట్‌ రన్‌రేట్‌ కూడా బాగానే ఉంది.. కాకపోతే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఇంకా ఖరారు కాలేదు.. వచ్చే రెండు మ్యాచ్‌లలో గెలవడమే కాకుండా రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకోవాలి.. దాంతో పాటు పోటీలో ఉన్న జట్లు భారీ తేడాతో గెలవకుండా ఉండాలని కోరుకోవాలి.. ముంబాయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఢిల్లీ ఆడాల్సి ఉంది.. ఇక మన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విషయానికి వస్తే ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉన్నా.. అందుకు జట్టు చాలా కష్టపడాలి.. దాంతో పాటు అదృష్టం కలిసిరావాలి.. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ పది పాయింట్లను మాత్రమే సాధించింది.. అంటే మిగతా రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా విజయం సాధించాలి. రన్‌రేట్‌ విషయంలో పంజాబ్‌ కంటే ముందే ఉన్నా అది సరిపోదు.. బెంగళూరు, ముంబాయిలతో జరిగే మ్యాచ్‌లలో విజయం సాధించి తీరాలి..