Chennai Cleaner Padma: బ్యాగులో రూ. 45 లక్షల బంగారం.. ఇంటికి తీసుకెళ్తే కుటుంబం బతికేది.. కానీ..
"చదువుకున్న వారు తమకు తెలిసిన పని చేస్తారు, నేను నాకు తెలిసిన పని చేస్తున్నాను.. ఇందులో సిగ్గుపడటానికి ఏముంది?" అని గర్వంగా చెప్పే పద్మమ్మ జీవితం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. 20 ఏళ్లుగా క్లీనర్గా పనిచేస్తూ, కష్టార్జితంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమె, పరాయి సొమ్ము పాము వంటిదని నిరూపించారు. ఆమె అసాధారణ నిజాయితీని గుర్తించిన భారత తపాలా శాఖ, ఏకంగా ఆమె ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంపును విడుదల చేసి అరుదైన గౌరవాన్ని అందించింది.

మనుషులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్న నేటి రోజుల్లో, దొరికిన లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి ఇచ్చేసిన గొప్ప మనసు పద్మమ్మది. చెన్నైలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ, రోడ్డుపై పడి ఉన్న రూ.45 లక్షల విలువైన నగల బ్యాగును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఆమె చేసిన ఈ పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
పద్మమ్మ మాటల్లో ఆమె జీవన సూత్రాలు:
వృత్తి పట్ల గౌరవం:
“పారిశుధ్య కార్మికులు లేకపోతే దేశం శుభ్రంగా ఉంటుందా? పోలీసులు యూనిఫాం ధరించినట్లే, నా యూనిఫాం కూడా నాకు గౌరవ చిహ్నం” అని ఆమె గర్వంగా చెబుతారు.
నిజాయితీ వెనుక ఉన్న ఆలోచన:
నగల బ్యాగు దొరికినప్పుడు ఆమెకు కలిగిన మొదటి ఆలోచన ఆ నగలు పోగొట్టుకున్న వారి బాధ గురించి. “నేను సంపాదించని డబ్బుతో నేనేం చేసుకుంటాను? నా కష్టార్జితం నాకు చాలు” అనే ఆమె మాటలు నిజాయితీకి అసలైన నిర్వచనం.
అదే సంతృప్తి:
చెత్తతో నిండిన వీధిని శుభ్రం చేశాక తిరిగి చూసుకున్నప్పుడు కలిగే సంతృప్తి, ఏ ఆస్తి ఇచ్చినా రాదని ఆమె నమ్ముతారు.
కుటుంబమే గర్విస్తోంది:
ఒకవేళ ఆ నగలు తీసుకెళ్లి ఉంటే తన కుటుంబం భయంతో బతికేదని, కానీ ఇప్పుడు తన నిజాయితీ వల్ల తన పిల్లలు తలెత్తుకుని తిరుగుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అందించిన అరుదైన గౌరవం:
పద్మ చేసిన ఈ పనికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చెన్నై సెంట్రల్ డివిజన్ పోస్టల్ కార్యాలయం ఆమె గౌరవార్థం ‘మై స్టాంప్’ (My Stamp) పథకం కింద ఆమె ఫోటోతో కూడిన స్టాంపును విడుదల చేసింది. ఒక సాధారణ పారిశుధ్య కార్మికురాలికి ఇలాంటి గౌరవం దక్కడం ఆమె నిజాయితీకి దక్కిన గొప్ప విజయం.
