AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hospital Business: జాతకాల మాయలో సాధారణ కాన్పులు మరిచిపోతున్న జనం.. సిజేరియన్లతో దోచేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు!

పురిటినొప్పులు వచ్చాయంటే చాలు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల పంట పండుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో 99 శాతం సిజేరియన్లే చేసి జనాన్ని లూటీ చేస్తు్న్నాయి ప్రైవేట్‌ ఆస్పత్రులు.

Hospital Business: జాతకాల మాయలో సాధారణ కాన్పులు మరిచిపోతున్న జనం.. సిజేరియన్లతో దోచేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు!
Nizamabad Hospitals Business
Balaraju Goud
|

Updated on: Oct 13, 2021 | 9:01 PM

Share

Caesarean Deliveries: పురిటినొప్పులు వచ్చాయంటే చాలు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల పంట పండుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో 99 శాతం సిజేరియన్లే చేసి జనాన్ని లూటీ చేస్తు్న్నాయి ప్రైవేట్‌ ఆస్పత్రులు. అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే దందా యధేచ్చగా కొనసాగుతోంది.

సిజేరియన్లు ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల పంట పండిస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ అన్న మాటే మర్చిపోయారు వైద్యులు. ఆస్పత్రుల్లో 90 శాతానికి పైగా సిజేరియన్లే చేస్తున్నారు. గర్భిణీల కుటుంబాన్ని ముంచేస్తున్నారు. లక్షల రూపాయ ఫీజులు వసూలు చేసి జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులు రావడంతో భయభయంగా డెలివరీ కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది. ఈ సమయంలో సాధారణ కాన్పు సాధ్యం కాదని , సిజేరియన్‌ చేయాల్సిందేనని ఆస్పత్రి సిబ్బంది ఆమెను మరింత భయపెట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. సిజేరియన్‌ చేసి పిల్లను బయటకు తీశారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి లక్ష రూపాయల బిల్లు వేసి పంపించారు. ఈ దందా నిజామాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇదే దోపిడీ కొనసాగుతోంది. ఒకవేళ అదే మహిళకు నార్మల్‌ డెలివరీ చేస్తే 25 వేల రూపాయల బిల్లు మాత్రమే అయ్యేది . సాధారణ ప్రసవం జరిగితే ప్రాణాలకే ప్రమాదం అంటూ భయపెట్టి ఆ కుటుంబాన్ని నమ్మించి దోచేశారు.

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా డెలివరీకి వచ్చే మహిళలకు 99 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి. గత ఏప్రిల్‌ నుంచి జులై వరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 15,806 ప్రసవాలు జరిగాయి. అందులో 14,356 సిజేరియన్‌ ఆపరేషన్లతోనే చేశారు. కేవలం 1,450 మందికే నార్మల్‌ డెలివరీ చేశారు. దీనిని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై ప్రైవేట్‌ ఆస్పత్రులు ఈ దందా నడుపుతున్నాయి. లక్ష రూపాయల ప్యాకేజీని వసూలు చేస్తున్నారు. ఓవైపు భయం .. మరోవైపు అమాయకత్వం వాళ్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు మోసపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి వైద్యశాఖ అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రుల అక్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీలను పెంచుతున్నామని గొప్పలు చెబుతున్న అధికారులు ఈ లెక్కలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఏప్రిల్‌ నుంచి జులై వరకు 15,137 ప్రసవాలు జరిగాయి. విచిత్రంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సగానికి పైగా సీజెరియన్లే జరిగాయి. 8772 మందికి సిజేరియన్లు చేయగా కేవలం 6365 మందికే నార్మల్‌ డెలివరీ చేశారు. సిజేరియన్లలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోటీగా ప్రభుత్వ ఆస్పత్రులు తయారయ్యాయి. అంతే కాదు కొందరు ప్రభుత్వ వైద్యులు తమ క్లినిక్‌లకు గర్భిణీలకు షిఫ్ట్‌ చేసి సిజేరియన్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

కేసీఆర్‌ కిట్‌ , ఇంకా చాలా ప్రోత్సాహకాలు ఇస్తునప్పటికి చాలామంది సిజేరియన్లకే మొగ్గు చూపిస్తున్నారని వైద్యులు సమాధానం ఇస్తున్నారు. ఇక జాతకాల పిచ్చితో కొందరు సిజేరియన్లకే జై కొడుతున్నారు. ఇంకోవైపు పురిటినొప్పుల బాధను తట్టుకోలేని కొంతమంది అదే పనిచేస్తున్నారు. కాని సిజేరియన్లతో మహిళల ఆరోగ్యానికి పెనుప్రమాదం పొంచిఉందని నిపుణులు చెబుతున్నారు. వయస్సు పెరిగిన కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. 40 ఏళ్లు దాటిన తరువాత వాళ్లు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. సిజేరియన్ల నియంత్రణకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

సిజేరియన్లు ఆపండి.. సాధారణ ప్రసవాలకు వెళ్లండి అన్న సందేశాన్ని ప్రచారం చేయాల్సిన బాద్యత అధికారులపై ఉంది. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రుల లూటీతో పాటు మహిళ ఆరోగ్యానికి భద్రతకు ముప్పు కొనసాగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also…  Huzurabad By Election: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మరో షాక్.. ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు

Follow Us