ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ వైద్యులకు ఆపరేషన్లు చేసే అవకాశం ఇవ్వొద్దు, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది: డాక్టర్లు
ఆయుర్వేద వైద్యులు కూడా ఆధునిక ఆపరేషన్లు చేసేందుకు పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది...
ఆయుర్వేద వైద్యులు కూడా ఆధునిక ఆపరేషన్లు చేసేందుకు పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. 14 రోజులపాటు రిలే నిరాహార దీక్షలకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో విజయవాడలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. మిక్సోపతి పాలసీలకు, కిచిడీ వైద్యానికి, వైద్య విధానానికి వ్యతిరేకం అనే బ్యానర్ కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లకు తాము వ్యతిరేకం కాదని డాక్టర్ సమరం స్పష్టం చేశారు.
ఆయుర్వేద రంగంలో ప్రభుత్వం మరింత ఖర్చు పెట్టి పరిశోధనలు చేసి రంగం వృద్ధికి సహాయపడాలని, అంతేకాని, వారికి సర్జరీలు చేయడానికి అనుమతి ఇవ్వడం పెద్ద తప్పంటున్నారు సమరం. ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చిన 58 రకాల ఆపరేషన్లకు అనుమతిస్తారా, దీని వల్ల ప్రజారోగ్యంప్రమాదంలో పడుతుంది అని ఆయన హెచ్చరిస్తున్నారు. పంటివైద్యం, కంటి చికిత్స, ఇతర కీలకమైన ఆపరేషన్లు ఆరు నెలల ట్రైనింగ్లో వాళ్లు ఎలా చేయగలరని ప్రశ్నిస్తున్నారు. తాము ఎంబీబీఎస్ మూడేళ్లు, మరో మూడేళ్లు సర్జన్స్పై ప్రత్యేక తర్ఫీదు పొందుతామన్నారు. సుమారు 8ఏళ్లు తాము నేర్చుకున్న విద్యను వాళ్లకు ఆరు నెలల్లో ఎలా ట్రైన్ చేస్తారని నిలదీస్తున్నారు.
ఆపరేషన్ సమయంలో ఇచ్చే ఎనస్తీషియా ఎవరు ఇస్తారని అడుగుతున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయుర్వేదం, యునానీ, హోమియా మందులు ఇస్తారా లేకుంటే నార్మల్ మెడిసిన్ ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే సంకర వైద్యం పనికిరాదంటూ నినదించారు డాక్టర సమరం. ఈ ప్రతిపాదనలతో సిద్దమైన బిల్లులు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైద్యులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 14 రోజుల పాటు రిలీ నిరాహార దీక్షలు చేస్తున్నామని… బిల్లుల అంశంలో వెనక్కి తగ్గకుంటే తమ ఆందోళన తీవ్ర తరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేద, హోమియోపతి వైద్యులను ఎక్కడా తక్కువగా చూడటం లేదని ఆ సెక్టార్లలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంతే కానీ అన్నింటిని మిక్స్ చేసి గందరగోళపరచొద్దని హితవు పలుకుతున్నారు.