Anthapuram: అంతఃపురం సినిమా వెనుక అసలు కథ ఇది.. 27 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. సౌందర్య యాక్టింగ్ పీక్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. అందులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అందులో అంతఃపురం సినిమా ఒకటి. 1998లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో జగపతి బాబు, సౌందర్య యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథను వివరించారు డైరెక్టర్ కృష్ణ వంశి.

దర్శకుడు కృష్ణవంశీ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రూపొందించిన చిత్రాల్లో అంతఃపురం ఒకటి. ఈ మూవీ ఒక శక్తివంతమైన, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. దీని వెనుక ఉన్న ప్రేరణ, దాని రూపకల్పన ప్రక్రియను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఒక అంతర్జాతీయ కథ తన సినిమాకు ఎలా పునాదిగా నిలిచిందో ఆయన వెల్లడించారు. కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతా చిత్రం చేస్తున్న సమయంలో, దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ఆయనకు నాట్ వితౌట్ మై డాటర్ (Not Without My Daughter) అనే టెలిఫిలిం క్యాసెట్ను బహూకరించారని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం అమెరికాకు చెందిన డాక్టర్ బెట్టి మహమూద్ నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడిందని.. అందులో బెట్టి మహమూద్ ఒక ఇరానియన్ అయిన మహమూద్ను పెళ్లి చేసుకుంటుంది. అమెరికాలో ఉండగా, భర్త ఉద్యోగం కోల్పోవడంతో, ఒక కుటుంబ వేడుక కోసమని తన భార్యను, కూతురును ఇరాన్కు తీసుకెళ్తాడు.
అక్కడ ఎయిర్పోర్టులో దిగిన దగ్గర నుంచే ఆవిడకు ఇరానియన్ సంస్కృతి, కఠినమైన నియమాలు ఎదురవుతాయి. తల కప్పుకోవాలని, హిజాబ్ ధరించాలని బలవంతం చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, మొత్తం ఉమ్మడి కుటుంబంలో పరదాలు, బురఖాల మధ్య జీవనం ఆవిడను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. మొదట కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండాలని అనుకున్న బెట్టికి, భర్త నిర్ణయం షాక్ ఇస్తుంది. ఇరాన్లోనే ఉండిపోవాలని, అమెరికాలో సెకండ్ గ్రేడ్ సిటిజెన్గా ఉండలేనని, తన కూతురు తమ పద్ధతుల్లోనే పెరుగుతుందని భర్త స్పష్టం చేస్తాడు. దీంతో బెట్టి, “నా కూతురు లేకుండా నేను వెళ్ళను” (Not Without My Daughter) అని దృఢంగా నిశ్చయించుకుంటుంది.
ఖొమేని మత రాజ్యం ప్రారంభమైన ఆ సమయంలో, అమెరికన్ క్రిస్టియన్ మహిళ అయిన బెట్టి, తన కూతురితో కలిసి భర్త బంధువుల కళ్ళగప్పి, ఇరాన్ సరిహద్దులను దాటి తప్పించుకోవడానికి చేసిన పోరాటమే ఈ కథాంశం. చివరికి ఆమె తప్పించుకుని వచ్చి తన అనుభవాలను నాట్ వితౌట్ మై డాటర్ అనే పేరుతో పుస్తకంగా రాసింది. ఈ పుస్తకం ఆధారంగా సాలీ ఫీల్డ్స్ (ప్రస్తుతం బ్యాట్ మ్యాన్ సినిమాలో తల్లి పాత్రలో నటించిన నటి) ప్రధాన పాత్రలో ఒక టెలిఫిలిం రూపొందించబడింది. ఈ కథ కృష్ణవంశీని ఎంతగానో ప్రభావితం చేసింది. సిందూరం పూర్తి చేసి, చంద్రలేఖ చేస్తున్న సమయంలో, ఈ నాట్ వితౌట్ మై డాటర్ ఇన్సిడెంట్ ఆయన మనసులో మెదులుతూనే ఉంది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది – “ఈ అమెరికన్ మహిళ కథ రాయలసీమ బ్యాక్డ్రాప్లోకి వస్తే ఎలా ఉంటుంది? బాంబు బ్లాస్ట్లు, డెడ్ బాడీలు ఉన్న ఈ వాతావరణంలోకి వస్తే ఎలా ఉంటుంది?” ఈ వినూత్నమైన కాన్సెప్ట్ నుంచే అంతఃపురం చిత్రం ఆవిర్భవించింది.
అదే సమయానికి, దర్శకుడు భరద్వాజ కిరణ్ ఒక సినిమా కోసం అడగగా, కృష్ణవంశీ తన ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. ఈ ఐడియా విన్న భరద్వాజ థ్రిల్ అయ్యారు. ఎందుకంటే, భరద్వాజ కూడా గత పది సంవత్సరాలుగా నాట్ వితౌట్ మై డాటర్ చూసి ఆ కథతో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా, కృష్ణారెడ్డి, జయసుధ, జయప్రద వంటి వారు కూడా ఈ కథాంశంపై ఆసక్తి చూపినట్లు లేదా దాని ఆధారంగా సినిమాలు చేయాలని ప్రయత్నించినట్లు కృష్ణవంశీ తెలిపారు. భరద్వాజకు తన ఐడియా చెప్పినప్పుడు, “ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాం రా మేము ఈ ఐడియాని. ఈ బ్యాక్డ్రాప్కి అదిరిపోయింది. నా దగ్గర స్క్రిప్ట్ ఉంది. ఇది అయితే ఓకే రా, ఇమ్మీడియట్గా చేసెద్దాం” అని అన్నారట. ఈ విధంగా అంతఃపురం అనేక అంశాల కలయికతో రూపుదిద్దుకుంది. “ఏ సినిమా ఊరికే రాదు. నథింగ్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ వాక్యూమ్. ప్రతి దానికి బ్యాకింగ్ ఉంటది, ఫౌండేషన్ ఉంటది. బయటికి కనపడదు అంతే” అని కృష్ణవంశీ తన సినిమా రూపకల్పన వెనుక ఉన్న లోతైన ఆలోచనలు వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
