AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Phani CH
|

Updated on: Jul 13, 2026 | 4:38 PM

Share

నదీ నీరు, సముద్రపు ఉప్పునీటి మధ్య ఉండే సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే దేశంలోనే తొలి ‘ఆస్మాటిక్ పవర్ ప్లాంట్’ను జపాన్ ప్రారంభించింది. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా, కార్బన్ ఉద్గారాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ‘బ్లూ ఎనర్జీ’ సాంకేతికత భవిష్యత్ స్వచ్ఛ ఇంధన రంగంలో కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నదులు వచ్చి సముద్రంలో కలిసే ప్రతిసారీ.. మంచినీరు, ఉప్పునీరు మిళితమయ్యే క్రమంలో కొంత శక్తి నిశ్శబ్దంగా వృథా అవుతుంటుంది. ప్రకృతిలో జరిగే ఈ సహజసిద్ధమైన ప్రక్రియను ఒడిసిపట్టి, అత్యాధునిక సాంకేతికతతో విద్యుత్‌ను తయారు చేసే సరికొత్త విప్లవానికి జపాన్ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. జపాన్‌లోని తీరప్రాంత నగరం ఫుకుయోకాలోని ‘మామిజుపియా’ డీశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ‘ఆస్మాటిక్ పవర్ ప్లాంట్‌’ను ప్రారంభించారు. డెన్మార్క్ తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి సాంకేతికతతో నడుస్తున్న రెండో ప్లాంట్ ఇదే కావడం విశేషం. ఈ ప్లాంట్ ‘ఆస్మాసిస్’అనే శాస్త్రీయ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ‘ప్రెజర్-రిటార్డెడ్ ఆస్మాసిస్’ అంటారు. ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ ద్వారా ఒకవైపు అత్యధిక ఉప్పు సాంద్రత గల నీటిని, మరోవైపు మంచినీటిని ఉంచుతారు. అప్పుడు సహజంగానే ఉప్పునీటి వైపుకు మంచినీరు విపరీతమైన వేగంతో దూసుకువస్తుంది. ఈ ప్రక్రియ వల్ల అక్కడ నీటి పరిమాణం, ఒత్తిడి భారీగా పెరుగుతాయి. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడితో టర్బైన్‌ను తిప్పి, జనరేటర్ సహాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి ఇంధనం వాడరు, అలాగే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు అసలే విడుదల కావు. సాధారణ సముద్రపు నీటిలో 3.5 శాతం ఉప్పు ఉంటే, ఈ డీశాలినేషన్ కేంద్రంలో మంచినీటిని వేరు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ ఉప్పునీటిలో ఏకంగా 8 శాతం ఉప్పు సాంద్రత ఉంటుంది. అలాగే మంచినీటి వైపు మురుగునీటి ప్లాంట్ నుంచి తెచ్చిన శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. ఈ రెండింటి మధ్య ఉప్పు సాంద్రత తేడా ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువ విద్యుత్ వస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ ఏడాదికి 8,80,000 కిలోవాట్ అవర్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది, ఇది దాదాపు 300 జపనీయుల కుటుంబాల అవసరాలకు సరిపోతుంది. సౌరశక్తి, పవన విద్యుత్ లాగా కాకుండా వాతావరణంతో సంబంధం లేకుండా, ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా ఈ ప్లాంట్ 90 శాతం సామర్థ్యంతో రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఫిల్టర్లు పూడుకుపోవడం వంటి కొన్ని సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నదీ ముఖద్వారాల వద్ద ఈ ‘బ్లూ ఎనర్జీ’ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు జపాన్ ప్రయోగం ఒక దిక్సూచిగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

Follow Us