AP – Telangana: ఓట్ల పండుగపై వర్షం ఎఫెక్ట్ పడనుందా…? వెదర్ రిపోర్ట్ ఏంటి..?
మే 13న తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే పోలింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

సోమవారం ఓట్ల పండుగపై వర్షం ఎఫెక్ట్ పడనుందా…? పోలింగ్ రోజున వర్షం షాకిస్తుందా…? ఇప్పటికే పలుచోట్ల వాన దంచికొడుతుండటం… వాతావరణశాఖ మరో మూడ్రోజులు భారీ వర్షాలంటూ వార్నింగ్ ఇవ్వడం… మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని వర్షం వణికిస్తోంది. పోలింగ్కు ఏర్పాట్లు జరుగుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఈదురుగాలులతో కూడిన వాన రావడంతో టెంట్లు తడిచిపోయాయి. కుర్చీలు ఎగిరిపోయాయి. మరోవైపు పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షం నుంచి EVMలను కాపాడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షం నీరు పడుతుండటంతో.. వాటిని కాపాడేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వాన రావడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లన్నీ నేలమట్టమయ్యాయి. వర్షానికి పలు పోలింగ్ కేంద్రాల్లో భారీగా నీరు చేరడం… సోమవారం పోలింగ్ నిర్వహణపై ఆందోళన కలిగిస్తోంది.
ఇటు ఏపీని వర్షాలు భయపెడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలలతో కూడిన వర్షం పడుతోంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురుగా ఎగిరి పడుతున్నాయి. కడప జిల్లా పులివెందులలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుంది పులివెందులలో వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. దీంతో పులివెందుల పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికలకు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు ఎగిరిపడ్డారు. ఎన్నికల అధికారులు సైతం ఇబ్బందులు పడ్డారు. రేపటి ఎన్నికలకు ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి