Gujarat Elections 2022: రాహుల్ యాత్రలో మేధా పాట్కర్.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ చేతికి మరో బలమైన ప్రచారాస్త్రం..
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రం నిరాటంకంగా ముందుకు..

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రం నిరాటంకంగా ముందుకు సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రాంతీయ నేతలతో రాజకీయ చర్చలు చేస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఆ రాష్ట్రంలోని వాషిమ్లో మేధా పాట్కర్తో కలిసి నడుస్తూ.. బుధవారం బీజేపీని లక్ష్యంగా చేసుకుని..‘‘సోషల్ మీడియా ద్వారా ఎన్నికలను రిగ్గింగ్ చేయవచ్చని, సోషల్ మీడియా కంపెనీలు కోరుకుంటే, వారు ఏ పార్టీనైనా ఎన్నికల్లో గెలిపించగలరు. ఒక సిద్ధాంతం, దాని నాయకులు సమాజంలో అశాంతిని కలిగించడానికి మతపరమైన హింసను వ్యూహాత్మక ఆయుధంగా పెంచుతున్నార’’ని అన్నారు.
అయితే గుజరత్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినవారితో రాహుల్ గాంధీ చేతులు కలిపారని.. మేధా పాట్కర్ గుజరాతీ వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహించింది. ఈ మేరకు కమలం పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద మండిపడింది. ‘‘గుజరాత్, గుజరాతీల పట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీ పదే పదే తమ వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. మేధా పాట్కర్కు తన యాత్రలో కేంద్ర స్థానం కల్పించడం ద్వారా, దశాబ్దాలుగా గుజరాతీలకు నీళ్లు ఇవ్వని వారితో తాను నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్తున్నారు. దీన్ని గుజరాత్ సహించద’’ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కాంగ్రెస్పై మండిపడ్డారు. ‘‘గుజరాత్లో 2017లో ప్రారంభమైన సర్దార్ సరోవర్ డ్యామ్కు వ్యతిరేకంగా మేధా పాట్కర్ ప్రచారం చేశారు. పాట్కర్ ‘నర్మదా బచావో’ అనే పేరుతో ఆందోళన చేపట్టి, ఆ డ్యామ్ నుంచి వచ్చిన నీరు వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేస్తుందని ఆమె అన్నార’’ని బీజేపీ గుర్తు చేసింది.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మంచి ప్రచారాస్త్రం దొరికిందిన అందరూ అభిప్రాయపడుతున్నారు. గుజరాత్కు నీటిని అందించే సర్దార్ సరోవర్ డ్యామ్కు వ్యతిరేకంగా మేధా పాట్కర్ ఉద్యమం నడిపించారని గుజరాతీయులందరికీ తెలిసిన విషయమే. అలాంటి పాట్కర్ను ఇప్పుడు రాహుల్ గాంధీ సన్నిహితంగా కలిశారు తన పాదయాత్రలో. తద్వారా గుజరాతీ ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరోసారి కాషాయ దళానికి తమ ఓటును వేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుండగా.. అంది వచ్చిన అవకాశాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవాలనే యోచనలో గుజరాత్ బీజేపీ నాయకులు భావిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి..