AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన వృద్ధుడిపై డాక్టర్ దాడి వీడియో

ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన వృద్ధుడిపై డాక్టర్ దాడి వీడియో

Samatha J

|

Updated on: Apr 27, 2025 | 4:45 PM

వైద్యో నారాయణోహరిః వైద్యుడు భగవంతుడితో సమానం. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజం డాక్టర్లకు ఉన్నత స్థానం ఇచ్చింది. కానీ మధ్యప్రదేశ్ లో ఒక వృద్ధుడి పట్ల ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన జరిగింది. 77 ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్ రెడ్ క్రాస్ వర్కర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉద్ధవ్ సింగ్ జోషి అనే వృద్ధుడు తన భార్య ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదంలో డాక్టర్ రాజేష్ మిశ్రా అతన్ని కొట్టి బలవంతంగా లాక్కెళ్ళినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రిలో అందరి మాదిరిగానే స్లిప్ తీసుకొని చాలా సేపు క్యూలో నిలబడ్డానని తన వంతు వచ్చినప్పుడు ముందుకు కదులుతుంటే డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పాడు. అంతేకాదు వృద్ధుడిని అని కూడా చూడకుండా చెంపదెబ్బ కొట్టి తన్నాడని జోషి ఆరోపించాడు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోషిని కొడుతూ ఆసుపత్రి నుంచి బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి జోషిని కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది. అయితే జోషి ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది తప్పుబడుతున్నారు. ఆసుపత్రిలో ఆ రోజు భారీగా జనాలు వచ్చారు. ఆ క్రమంలో జోషి క్యూలైన్ దాటి ముందుకు వచ్చారని అందుకే డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. వృద్ధుడిపై డాక్టర్ దాడికి పాల్పడిన ఘటనపై మధ్యప్రదేశ్ లో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించి ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బదులు హింసలు జరుగుతున్న ఈ అభివృద్ధి మోడల్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాలకులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సైతం స్పందించి దర్యాప్తు ప్రారంభించారు.