5 State Election Results 2022 : హోలీ పండుగ ముందుగానే వచ్చింది.. ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ..

| Edited By: Shiva Prajapati

Updated on: Mar 11, 2022 | 1:44 AM

5 State Assembly Election Results 2022 Highlights: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు(Assembly Election Results ) వెలువడుతున్నాయి.

5 State Election Results 2022 : హోలీ పండుగ ముందుగానే వచ్చింది.. ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ..
Election Results 2022

5 State Assembly Election Results 2022 Highlights: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు(Assembly Election Results ) వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, పంజాబ్‌లో ఆప్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అక్కడ అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ చెక్ పెట్టింది. సీఎం చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ సహా పలువురు దిగ్గజ నేతలు ఓటమి పాలయ్యారు.

ఇక ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి.  అన్నట్లుగానే బీజేపీనే విజయదుందుభి మోగించింది.  255 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా.. దాని మిత్రపక్షాలు మరికొన్ని సీట్లు గెలుపొందాయి.

ఉత్తరాఖండ్ లో మళ్లీ కమలమే..

కొండ ప్రాంతాలైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది.  ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన తొలి పార్టీగా అవతరించింది. 2002లో ఉత్తరాఖండ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తర్వాత 2007లో బీజేపీ, 2012లో కాంగ్రెస్, 2017లో బీజేపీ గెలిచాయి. ఇప్పుడు మళ్లీ బీజేపీ గెలుపొందింది.

గోవా, మణిపూర్ లలోనూ బీజేపీదే హవా..

ఇక గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది.  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అదృష్టం పరీక్షించుకుని నెగ్గారు.

పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు..

ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. ఐదు రాష్ట్రాలతో పాటు అస్సాంలోని మజులి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరిగింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పోలీసు పరిశీలకులు, 10 మంది ప్రత్యేక పరిశీలకులను నియమించారు.

Also Read:UP Election Results 2022 LIVE: మరికాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా?

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Mar 2022 09:20 PM (IST)

    92 స్థానాల్లో ఆప్ ఘన విజయం..

    పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు, కాంగ్రెస్‌కు 18, భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలుచుకున్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు 3 సీట్లు రాగా, ఒక సీటు బీఎస్పీ 1, సంతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు.

  • 10 Mar 2022 08:19 PM (IST)

    హోలీ పండుగ ముందుగానే వచ్చింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

    నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ దక్కించుకున్న విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో.. పార్టీ శ్రేణులుద్దేశించి ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఉత్సవం జరుపుకునే రోజు అంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సాహం భారత ప్రజాస్వామిక ఉత్సవమన్నారు. తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. ప్రజంలతా అఖండ విజయాన్ని అందించారన్నారు. దీంతో హోలీ పండుగ ముందగానే వచ్చిందని పేర్కొన్నారు.

  • 10 Mar 2022 07:43 PM (IST)

    పార్టీ కార్యకర్తల వల్లే ఈ విజయాలు వరించాయి.. జేపీ నడ్డా

    బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల వల్లే ఈ విజయం దక్కిందంటూ కొనియాడారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అప్పజెప్పిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. బీజేపీ చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారంటూ ప్రశంసలు కురిపించారు.

  • 10 Mar 2022 07:39 PM (IST)

    ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సంబురాలు.. పాల్గొన్న ప్రధాని మోదీ

    నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ దక్కించుకున్న విజయాన్ని, ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో.. పార్టీ శ్రేణులుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

  • 10 Mar 2022 06:43 PM (IST)

    గోవాలో బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు

    ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఇస్తున్నట్లు లేఖ ఇచ్చారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ షెట్ తనవాడే ప్రకటించారు. దీంతో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

  • 10 Mar 2022 06:27 PM (IST)

    ఉత్తరాఖండ్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు..

    బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సీఎం పుష్కర్ సింగ్ ధామికి చేరుకున్నారు. ఈ సందర్భంగా​ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాలు నిర్వహించారు.

  • 10 Mar 2022 06:17 PM (IST)

    భగవంత్‌ మాన్‌కు అభినందనలు: సీఎం చన్నీ

    ఆప్‌ విజయంపై సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ స్పందించారు. పంజాబ్‌ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీని, సీఎం ఎన్నిక కానున్న భగవంత్‌ మాన్‌ను శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజల అంచనాలను అందుకుంటారని ఆశిస్తున్నానంటూ ట్విట్ చేశారు.

  • 10 Mar 2022 05:56 PM (IST)

    బీజేపీ కార్యాలయానికి చేరుకున్న సీఎం యోగి

    ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. భారీ మెజారిటీతో 250కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

  • 10 Mar 2022 05:37 PM (IST)

    ఉత్తరప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీ దిశగా బీజేపీ.. ఇప్పటివరకు ఎన్ని గెలిచిందంటే..?

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బీజేపీ 30 స్థానాల్లో గెలవగా.. 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 3 గెలిచి 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అప్నా దళ్ (సోనీలాల్) 1 గెలవగా.. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. RLD 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 1 గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  • 10 Mar 2022 05:32 PM (IST)

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం.. 20 స్థానాల్లో గెలుపు.. మరో 27 సీట్లల్లో..

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ 20 గెలిచి 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6 గెలిచి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. BSP 1 గెలవగా.. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

  • 10 Mar 2022 05:28 PM (IST)

    పంజాబ్‌లో దూసుకెళ్తున్న ఆప్.. 79 స్థానాల్లో గెలుపు.. మరో 13 స్థానాల్లో

    పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఆప్ 79 గెలిచి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 13 గెలిచి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శిరోమణి అకాలీదళ్ 3, BJP 2, BSP 1, ఇండిపెండెంట్ ఒకరు విజయం సాధించారు.

  • 10 Mar 2022 05:24 PM (IST)

    గోవాలో 20 సీట్లల్లో బీజేపీ గెలుపు..

    గోవాలో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. గోవాలో బీజేపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 9 విజయం సాధించి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్రవాది గోమంతక్, ఆప్ 2 చొప్పున, గోవా ఫార్వర్డ్ పార్టీ, రివల్యూషనరీ గోన్స్ పార్టీ 1, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందారు.

  • 10 Mar 2022 05:22 PM (IST)

    మణిపూర్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. 15 స్థానాలు కైవసం.. 14 స్థానాల్లో

    మణిపూర్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలవగా.. 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. జనతాదళ్ (యునైటెడ్) 5 గెలిచి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 10 Mar 2022 05:17 PM (IST)

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. సీఎం సీఎం పుష్కర్ సింగ్ ధామి

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. తనకు ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా అవకాశం అవకాశం కల్పించినందుకు ధామి పార్టీ, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ధామి 6,900 ఓట్లకు పైగా ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

  • 10 Mar 2022 04:58 PM (IST)

    ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ గెలుపు..

    ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కర్హల్‌ స్థానంలో 61,000 ఓట్లతో గెలుపొందారు

  • 10 Mar 2022 04:56 PM (IST)

    లక్ష ఓట్ల ఆధిక్యంతో సీఎం యోగి ఘన విజయం..

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్భన్ స్థానంలో లక్షా 1 వేయి ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శుభవతి ఉపేంద్ర దత్ శుక్లాపై సీఎం యోగి విజయం సాధించారు.

  • 10 Mar 2022 04:20 PM (IST)

    మణిపూర్ సీఎం ఘన విజయం..

    మణిపూర్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎన్ బీరెన్ సింగ్ హీంగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్‌పై 17,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.

  • 10 Mar 2022 04:18 PM (IST)

    హామీలన్నింటిని నెరవేరుస్తాం.. మనీష్ సిసోడియా..

    పంజాబ్ ప్రజల కోసం... కేజ్రీవాల్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తామని ఆప్ నేత మనీష్ సిసోడియా తెలిపారు. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, గోవాలో కూడా తొలి ప్రయత్నంలోనే గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాం అంటూ ఆప్ నేత మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు.

  • 10 Mar 2022 03:55 PM (IST)

    ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. రాహుల్ గాంధీ

    ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామంటూ రాహుల్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరిస్తున్నామని ప్రకటించారు. గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

  • 10 Mar 2022 03:35 PM (IST)

    గోవా బీజేపీదే.. సీఎం ప్రమోద్ సావంత్

    తాను రాష్ట్రమంతటా ప్రచారం చేయడం వల్ల తన సొంత నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేయలేకపోయానని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. దీంతో ఇది తనకు సవాలుగా మారిందన్నారు. కానీ తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తన కోసం ప్రచారం చేశారన్నారు. దీంతో తాను తక్కువ మార్జిన్ తో గెలిచాననని సావంత్ పేర్కొన్నారు. కానీ బీజేపీ భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు. గోవాలో బీజేపీకి 20 సీట్లు కన్ఫర్మ్ అని ముగ్గురు తమకు మద్దతును ఇచ్చారని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొ్న్నారు.

  • 10 Mar 2022 03:12 PM (IST)

    ఆప్ సీఎం అభ్యర్థి మాన్ ఘన విజయం..

    పంజాబ్‌లో ధురీ నుంచి పోటీ చేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 58,206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

  • 10 Mar 2022 03:01 PM (IST)

    ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి సంచలన ప్రకటన..

    పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు. తాను రాజ్‌భవన్‌లో కాకుండా భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఆప్‌ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న తరుణంలో భగవంత్ మాన్ సంగ్రూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి ఫోటోలు ఉండవని తెలిపారు. కార్యాలయాల్లో షహీద్ భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలు మాత్రమే ఉంటాయని AAP సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు.

  • 10 Mar 2022 02:58 PM (IST)

    నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమి..

    పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమి పాలయ్యారు. అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీచేస్తున్న ఆయన 6,750 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

  • 10 Mar 2022 02:35 PM (IST)

    రెండు సీట్లల్లో ఓటమిపాలైన సీఎం చన్నీ

    పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు. ఆయన పోటీచేస్తున్న రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పంజాబ్‌లో ఆప్ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది.

  • 10 Mar 2022 02:28 PM (IST)

    ఘోర ఓటమి పాలైన కెప్టెన్ అమరీందర్

    పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్ 19,873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి పోటీచేస్తున్న ఆయన భారీ ఓటమిని చవిచూశారు.

  • 10 Mar 2022 02:18 PM (IST)

    గోవాలో బీజేపీకి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు..

    బిచోలిమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ చంద్రకాంత్ షెట్యే భారతీయ జనతా పార్టీకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

    అంతేకాకుండా.. కోర్టాలిమ్ నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి మాన్యుయెల్ వాజ్, అలెక్సియో రెజినాల్డో బీజేపీకి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.

  • 10 Mar 2022 02:13 PM (IST)

    హనుమాన్ ఆలయంలో కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు

    ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లతో కలిసి ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

  • 10 Mar 2022 02:09 PM (IST)

    మణిపూర్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. సీఎం నివాసంలో వేడుకలు..

    మణిపూర్‌లో బీజేపీ పూర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇంఫాల్‌లోని మణిపూర్ సిఎం ఎన్ బీరెన్ సింగ్ నివాసంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. కాగా.. హీంగాంగ్ స్థానంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 18,271 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    వేడుకలు..

  • 10 Mar 2022 01:47 PM (IST)

    గోవాలో రెండో సీటు గెల్చుకున్న ఆప్‌..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ రెండో విజయం నమోదు చేసింది. వెలిమ్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి క్రూజ్ సిల్వా గెలుపు పొందారు. క్రజ్ సిల్వా వృత్తిరీత్యా ఇంజనీర్.

  • 10 Mar 2022 01:38 PM (IST)

    గోవాలో సీఎం ప్రమోద్‌ సావంత్ విజయం..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గెలుపొందారు. సాంక్విలిమ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. కాగా స్వతంత్ర పార్టీల మద్దతుతో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ప్రమోద్‌ తెలిపారు.

  • 10 Mar 2022 01:31 PM (IST)

    ఉత్తరాఖండ్‌లో మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ ఓటమి..

    ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ ఓటమి పాలయ్యారు. లాల్‌కాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప ప్రత్యర్థి చేతిలో 13, 893 ఓట్లతో ఓడిపోయారు.

    Harish Rawat

    Harish Rawat

  • 10 Mar 2022 01:22 PM (IST)

    Punjab Dhuri Election Result 2022: బంపర్‌ మెజార్టీతో గెలుపొందిన ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ విజయం సాధించారు. ధురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి దల్వీర్‌ సింగ్ గోల్డీపై 45వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

  • 10 Mar 2022 01:15 PM (IST)

    మణిపూర్‌లో బీజేపీ బోణి.. 21 స్థానాల్లో కొనసాగుతోన్న ఆధిక్యం..

    మణిపూర్‌లో బీజేపీ బోణి కొట్టింది. అలాగే జనతాదల్‌ (యునైటెడ్‌) అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. ఇంకా 21 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 6, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • 10 Mar 2022 01:07 PM (IST)

    Punjab Jalalabad Election Result 2022: శిరోమణి అకాలీదళ్‌ అధినేత పరాజయం..

    పంజాబ్‌లోని జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జలాలాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన జగదీప్‌ కాంబోజ్‌ చేతిలో ఓడిపోయారు..

  • 10 Mar 2022 12:59 PM (IST)

    గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: ప్రమోద్‌ సావంత్‌

    గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. దీంతో అక్కడ హంగ్‌ తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ మాత్రం తామే మరోసారి ప్రభుత్వాన్ని చేపడుతామంటున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP), స్వతంత్ర్య అభ్యర్థులందరూ తమకే మద్దతునిస్తున్నారని ప్రమోద్‌ తెలిపారు.

  • 10 Mar 2022 12:52 PM (IST)

    ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం: సిద్ధూ

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ కేవలం 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 90కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఆప్‌ అధికారం చేపట్టేదిశగా అడుగులువేస్తోంది. కాగా కాంగ్రెస్‌ ఓటమిపై ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ కు శుభాకాంక్షలు తెలిపారు సిద్ధూ.

  • 10 Mar 2022 12:44 PM (IST)

    UK Lohaghat Election Result 2022: ఉత్తరాఖండ్‌లో ఖాతా తెరచిన కాంగ్రెస్‌..

    ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరచింది. లోహాఘాట్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఖుషాల్ సింగ్ విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పురాన్ సింగ్ ఫర్త్యాల్‌ రెండో స్థానంలో నిలిచారు.

  • 10 Mar 2022 12:41 PM (IST)

    పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకున్నారు: ఆప్‌ అధినేత

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. కాగా ఈ విజయంపై ఆప్‌ ఆధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌తో కలిసి విజయం గుర్తు చూపిస్తోన్న ఫొటోను షేర్‌ చేశారు. దీనికి 'పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకున్నారు. శుభాకాంక్షలు' అని క్యాప్షన్‌ ఇచ్చారు ఆప్‌ అధినేత.

  • 10 Mar 2022 12:30 PM (IST)

    పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..

    పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి,  పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

    Punjab elections 2022, pakistan pm imran khan, navjot sidhu, captain amarinder singh, punjab election news, punjab news

    Amarinder Singh

  • 10 Mar 2022 12:11 PM (IST)

    గోవాలో బోణి కొట్టిన బీజేపీ.. రెండు స్థానాల్లో విజయం..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల విజయం సాధించారు. మరొక స్థానంలో కాంగ్రెస్‌ గెలుపొందింది.

  • 10 Mar 2022 12:03 PM (IST)

    Punjab Pathankot Election Result 2022: పంజాబ్‌లో వెలువడిన మొదటి ఫలితం.. పఠాన్‌ కోట్‌ నుంచి అశ్వనీ శర్మ విజయం..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఫలితం వెలువడింది. పఠాన్‌కోట్‌ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వనీ కుమార్‌ శర్మ విజయం సాధించారు. ఆప్‌ పార్టీ అభ్యర్థి విభూతి శర్మపై  ఆయన గెలుపొందారు.

  • 10 Mar 2022 11:53 AM (IST)

    పంజాబ్‌లో మిన్నంటిన ఆప్‌ సంబరాలు..

    పంజాబ్‌లో కాంగ్రెస్‌, బీజేపీలను మట్టి కరిపించి అధికార పీఠం దక్కించుకుంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆప్‌ 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్‌ కేవలం16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక శిరోమణి అకాలీదళ్‌ కూటమి 6, బీజేపీ కూటమి4, ఇతరులు ఒక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా స్పష్టమైన మెజారిటీ రావడంతో పంజాబ్‌లో ఆప్‌ సంబరాలు మిన్నంటాయి. పంజాబ్‌ రాజధాని ఛండీఘర్‌, అమృత్‌సర్‌తో పాటు ఢిల్లీ, నాగ్‌పూర్‌లలో ఆ పార్టీ కార్యకర్తలు చీపర్లు పట్టుకుని నృత్యాలు చేస్తున్నారు.

  • 10 Mar 2022 11:47 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన ఉత్పల్‌ పారికర్‌..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌. అయితే అతను ఆశించినట్లు ఓట్లు రాలేదు. దీంతో నిరాశగా కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు ఉత్పల్‌. 'స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ మంచి ఓట్లు సాధించాను. అయితే ఫలితం నిరాశపరిచింది' అని చెప్పుకొచ్చారు ఉత్పల్‌.

  • 10 Mar 2022 11:33 AM (IST)

    ఉత్తరాఖండ్‌ లో 44 స్థానాల్లో బీజేపీ ముందంజ..

    ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 44 స్థానాలు, కాంగ్రెస్‌ 22 స్థానాలు, బీఎస్పీ 2, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దీంతో ఇక్కడ మరోసారి బీజేపీనే అధికారం చేపట్టనుంది.

  • 10 Mar 2022 11:28 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ వెనుకంజ...

    ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావత్‌ వెనుకంజలో ఉన్నారు. లాల్ కువాన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన మూడో రౌండ్‌ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్‌ కంటే 6885 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

  • 10 Mar 2022 11:20 AM (IST)

    పంజాబ్‌లో వెనుకబడ్డ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్ బాదల్‌..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది. చీపురు ధాటికి ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ లు పూర్తిగా వెనుకబడిపోయారు.

  • 10 Mar 2022 11:13 AM (IST)

    ఆధిక్యంలోకి వచ్చిన గోవా సీఎం.. ఉత్పల్‌ పారికర్‌ వెనుకంజ..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సన్‌క్యూలిమ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ ఆధిక్యంలోకి వచ్చారు. ప్రారంభం నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్‌ ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు మాత్రం ప్రమోద్‌ ముందంజలో నిలిచారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌ వెనుకంజలో ఉన్నారు.

  • 10 Mar 2022 11:01 AM (IST)

    గోవాలో కింగ్ మేకర్‌గా టీఎంసీ!

    గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇరుపార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమచారం ప్రకారం బీజేపీ 19 స్థానాలు, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమి 4 కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ టీఎంసీ సీట్లు కీలకం కానున్నాయి.

  • 10 Mar 2022 10:53 AM (IST)

    ఆప్‌ కార్యకర్తల సంబరాలు..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బంపర్‌ మెజారిటీ సాధించి అధికారం దిశగా దూసుకెళుతోంది. దీంతో అటు పంజాబ్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పంజాబ్‌లో 89 స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 12 సీట్లలోనే ముందంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది..

  • 10 Mar 2022 10:48 AM (IST)

    ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు నిరాశే..

    ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్క గోవా మినహా ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఆధిక్యం కనిపించడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌..పంజాబ్‌లో కేవలం 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లోనూ రెండోస్థానానికే పరిమితమైంది కాంగ్రెస్‌. గోవాలో మాత్రమే బీజేపీతో హోరాహోరీగా తలపడుతోంది.

  • 10 Mar 2022 10:42 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో అధికారం దిశగా బీజేపీ..

    ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళుతోంది. స్పష్టమైన మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్‌ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది కాషాయ పార్టీ. ఆప్‌ ఖాతా తెరవలేదు.

  • 10 Mar 2022 10:28 AM (IST)

    మణిపూర్‌లో ముఖ్యమంత్రి ముందంజ..

    మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 12, కాంగ్రెస్‌ 5, జేడీయూ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • 10 Mar 2022 10:16 AM (IST)

    హంగ్‌ దిశగా గోవా!!

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం 21 స్థానాలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 16, కాంగ్రెస్‌ కూటమి 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా ఆప్‌ , ఇతరులు ఒక్కొక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమి ఖాతా తెరవలేదు.

  • 10 Mar 2022 10:08 AM (IST)

    పంజాబ్‌లో సోనూసూద్‌ సోదరి వెనుకంజ.

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సోనూసూద్‌ సోదరి మాళవిక వెనుకంజలో ఉన్నారు.

  • 10 Mar 2022 10:06 AM (IST)

    మూడు రాష్ట్రాల సీఎంలు వెనుకంజ.. ఒక రాష్ట్రంలో ముందంజ..

    1. ఉత్తరాఖండ్‌ సీఎం ధామి వెనుకంజ
    2. పంజాబ్‌ సీఎం చన్నీ వెనుకంజ
    3. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వెనుకంజ
    4. గోరఖ్‌పూర్‌ నుంచి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ముందంజ..
  • 10 Mar 2022 09:56 AM (IST)

    మణిపూర్‌లో బీజేపీ హవా..

    మణిపూర్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ27 స్థానాలు, కాంగ్రెస్‌18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 10 Mar 2022 09:51 AM (IST)

    పంజాబ్‌ లో ఆప్‌ సీఎం అభ్యర్థి ముందంజ..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవత్ సింగ్‌ మాన్ ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇప్పటివరకు ఆప్‌ 83 స్థానాలు, కాంగ్రెస్‌ 23 స్థానాలు, శిరోమణీ అకాలీదళ్‌ కూటమి 8, బీజేపీ కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 10 Mar 2022 09:46 AM (IST)

    గోవాలో నువ్వా- నేనా?.. మొదలైన రిసార్ట్ రాజకీయాలు..

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈక్రమంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే రిసార్టు రాజకీయాలు ప్రారంభించాయి. DK శివకుమార్, మధు యాష్కీ , చిదంబరం తదితర కాంగ్రెస్‌ అగ్రనేతలు గోవా రాజధాని పనాజీలోనే మకాం వేశారు.

    కాగా గోవాలో మొత్తం 40 స్థానాల్లో బీజేపీ కూటమి 18 స్థానాలు, కాంగ్రెస్‌ అలయెన్స్‌ 16, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమి 4 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆప్‌ ఇంకా ఖాతా తెరవలేకపోయింది.

  • 10 Mar 2022 09:43 AM (IST)

    ఉత్తరాఖండ్ లో మేజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ..

    ఉత్తరాఖండ్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36 స్థానాలు) ను దాటేసింది. ప్రస్తుతం ఆ పార్టీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది.  అదేవిధంగా కాంగ్రెస్ 25 స్థానాల్లో ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు..

  • 10 Mar 2022 09:34 AM (IST)

    పంజాబ్‌లో సీఎం చన్నీ, సిద్ధూ వెనుకంజ..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ రెండుస్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. అదేవిధంగా పంజాబ్‌లోని పాటియాలా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తోన్న పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అజిత్ పాల్ కోహ్లీ కంటే 3, 300 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇక తూర్పు అమృత్‌సర్‌ నుంచి పోటీచేస్తోన్న పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మూడో స్థానానికి పడిపోయారు.

  • 10 Mar 2022 09:28 AM (IST)

    పంజాబ్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఆప్‌..

    ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆప్‌ దూసుకెళుతోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 59 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 60 కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 10 Mar 2022 09:20 AM (IST)

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌ నుంచి పోటీచేసిన పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ వెనకంజలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆప్‌ 44 స్థానాలు, కాంగ్రెస్‌ 30 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • 10 Mar 2022 09:16 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో సీఎం దామి వెనుకంజ..

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నా, ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఖతిమా నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. కాగా ఇప్పటివరకు బీజేపీ 34 స్థానాలు, కాంగ్రెస్‌ 28 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి..

  • 10 Mar 2022 09:15 AM (IST)

    గోవాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ..

    గోవాలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అక్కడ మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 17 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార బీజేపీ అభ్యర్థులు 14 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తృణాముల్ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులు 8 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నారు. ఆప్ ఖాతా తెరవలేక ఢీలాపడింది. ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 మ్యాజిక్ ఫిగర్ కాగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో తృణాముల్ కాంగ్రెస్ కూటమి మద్ధతు కీలకంగా మారే అవకాశముంది.

  • 10 Mar 2022 09:04 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో 36 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ దూసుకెళుతోంది. ఇప్పటివరకు మొత్తం 36 స్థానాల్లో ఆధిక్యం సంపాదించింది. అదేవిధంగా కాంగ్రెస్‌ 25 స్థానాలు, ఆప్‌ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి..

  • 10 Mar 2022 09:02 AM (IST)

    పంజాబ్‌లో కీలక అభ్యర్థుల ముందంజ..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా జలాలాబాద్ నుంచి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఫాజిల్కా నుంచి బీజేపీ అభ్యర్థి సుర్జీత్ కుమార్, సునమ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అమన్ అరోరా, సుజన్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్‌ సింగ్‌, సమ్రాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్, చబ్బెవాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ వెర్కా, బటాలా నుంచి ఆప్‌ అభ్యర్థి అమన్‌షేర్‌ సింగ్‌, బకాలా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బాబా సంతోక్ సింగ్ అకాలీదళ్‌కు చెందిన బోనీ అజ్నాలా అజ్నాలా నుంచి ముందంజలో ఉన్నారు.

    ఇక ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆప్‌ 41 స్థానాల్లో, కాంగ్రెస్‌ 30 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా అకాలీదళ్ అలయెన్స్‌, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 10 Mar 2022 08:56 AM (IST)

    గోవాలో కాంగ్రెస్‌ ముందంజ..

    గోవాలో హస్తం పార్టీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ 17 స్థానాలు, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  • 10 Mar 2022 08:53 AM (IST)

    శ్రీకృష్ణుని ఆలయంలో మణిపూర్‌ సీఎం ప్రత్యేక పూజలు..

    మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ రాజధాని ఇంఫాల్‌ లోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోసారి తమ పార్టీనే అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..

  • 10 Mar 2022 08:50 AM (IST)

    పంజాబ్ లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ముందంజ..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాద‌ల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

  • 10 Mar 2022 08:44 AM (IST)

    అమృత్‌ సర్‌లో సిద్ధూ ఆధిక్యం..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్ సర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 10 Mar 2022 08:40 AM (IST)

    గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటా పోటీ..

    గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం కమలం పార్టీ 16 స్థానాలు, కాంగ్రెస్‌ 15 స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాయి.

  • 10 Mar 2022 08:37 AM (IST)

    పంజాబ్‌లో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన ఆప్‌.. 35 స్థానాల్లో ఆధిక్యం..

    పంజాబ్‌లో ఆప్‌ పార్టీ దూసుకెళుతోంది. మొదట్లో కాంగ్రెస్‌ హవా సాగినా ఆ తర్వాత ఆప్‌ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఆప్‌ 35 స్థానాలు, కాంగ్రెస్‌ 20, అకాళీదళ్‌ అలయెన్స్‌ 5, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి..

  • 10 Mar 2022 08:34 AM (IST)

    పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగించిన గోవా సీఎం ప్రమోద్

    ధివంగత మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గం సాంక్వెలిమ్‌లోని శ్రీ దత్త మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు గురువారం ఉదయాన్నే ఆయన ఆలయానికి చేరుకున్నారు. బీజేపీ విజయం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కూడా గతంలో ఎన్నికల కౌంటింగ్ నాడు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసేవారు.

    గోవాలో ఉదయం 8 గం.లకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపన్ చేశారు. అందులోని ఈవీఎంలను పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ హాల్స్‌కు తరలించి.. ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలింది.

  • 10 Mar 2022 08:33 AM (IST)

    మణిపూర్‌ లో బీజేపీ ముందంజ..

    మణిపూర్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదే సమయంలో అకాళీదళ్‌ 5, బీజేపీ అలయెన్స్‌ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 10 Mar 2022 08:29 AM (IST)

    పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం..

    పంజాబ్‌లో 8 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది . అదేవిధంగా ఆప్‌ పార్టీ 6 స్థానాల్లో, అకాలీదళ్‌ అలయెన్స్‌ 2 స్థానాల్లోనూ ఆధిక్యం సాధించింది.

  • 10 Mar 2022 08:25 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో దూసుకెళుతోన్న బీజేపీ..

    ఉత్తరాఖండ్‌లో కమలం పార్టీ దూసుకెళుతోంది. ఇప్పటివరకు మొత్తం 22 స్థానాల్లో ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్‌ 19 స్థానాలతో గట్టి పోటీ ఇస్తోంది..

  • 10 Mar 2022 08:16 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    ఉత్తరాఖండ్‌లో కమలం పార్టీ దూసుకెళుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యం సంపాదించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది.

  • 10 Mar 2022 08:05 AM (IST)

    ప్రారంభమైన కౌంటింగ్‌..

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 5 రాష్ట్రాల్లోని 1200 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఆతర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. కాగా ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.

  • 10 Mar 2022 07:58 AM (IST)

    48కి అటు ఇటుగా సీట్లు వస్తాయి..

    ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావత్‌ తెలిపారు. సుమారు 48 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఉత్తరాఖండ్‌ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కనీసం 36 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఆప్‌, బీఎస్పీ బరిలో ఉన్నాయి.

  • 10 Mar 2022 07:48 AM (IST)

    పంజాబ్ లో గెలుపు సంబరాలపై నిషేధం..

    పంజాబ్ లో మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆప్ అధికారం చేపట్టవచ్చని ఎగ్జిట్ పోల్స్‌ తేల్చిచెప్పాయి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలందరూ అప్పుడే సంబరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలను అంగరంగవైభవంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే గెలుపు సంబరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

  • 10 Mar 2022 07:40 AM (IST)

    భగవంత్ మాన్ ప్రత్యేక ప్రార్థనలు..

    పంజాబ్‌ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంగ్రూర్‌లోని గురుద్వారా గురుసాగర్ మస్తువానా సాహిబ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పంజాబ్ ప్రజలు మార్పు కుంటున్నారని, కచ్చితంగా తమ పార్టే అధికారంలోకి వస్తుందని భగవంత్‌ మాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 10 Mar 2022 07:36 AM (IST)

    కౌంటింగ్‌కు ముందే సిద్ధూ కీలక నిర్ణయం..

    పంజాబ్‌లో ఆప్‌ అధికారం చేపడుతుందన్న వార్తల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థులందరూ పార్టీ ఆఫీసులో సమావేశం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే విజయం సాధించిన అభ్యర్థులందరూ కొత్త సీఎల్పీని ఎన్నుకోవాలని సూచించారు. కాగా ఇదంతా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే చేసినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఒకవేళ పంజాబ్‌లో హస్తానికి కావాల్సినంత మెజారిటీ రాకపోతే గెలిచిన వారిని ఇతర పార్టీలు తన్నుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటున్నారు.

  • 10 Mar 2022 07:31 AM (IST)

    పనాజీలో చిదంబరం..

    ఓట్ల లెక్కింపునకు ముందే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం గోవా రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 21 స్థానాలు గెలవాలి.

  • 10 Mar 2022 07:18 AM (IST)

    గోవాలో గెలుపుపై ప్రమోద్ సావంత్ ధీమా..

    ఎన్నికల ఫలితాల ముందు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అసెంబ్లీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

  • 10 Mar 2022 07:14 AM (IST)

    ప్రభుత్వాలు ఏర్పాటుచేసేందుకు కనీస మెజార్టీ ఎంతంటే..

    పంజాబ్‌  మొత్తం అసెంబ్లీ స్థానాలు - 117 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ - 59 బరిలో ఉన్న ప్రధాన పార్టీలు - కాంగ్రెస్‌, ఆప్‌, బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌

    ఉత్తరాఖండ్‌

    మొత్తం అసెంబ్లీ  స్థానాలు - 70 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ - 36 బరిలో ఉన్న ప్రధాన పార్టీలు - బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, బీఎస్పీ

    మణిపూర్

    మొత్తం అసెంబ్లీ స్థానాలు - 60 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ - 31 బరిలో ఉన్న ప్రధాన పార్టీలు - బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌

    గోవా

    మొత్తం అసెంబ్లీ స్థానాలు - 40 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ - 21 బరిలో ఉన్న ప్రధాన పార్టీలు - బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌

  • 10 Mar 2022 07:02 AM (IST)

    సంబరాలకు జిలేబీలు సిద్ధం చేస్తున్న ఆప్‌..

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్ తేల్చిచెప్పాయి. దీంతో ఆప్‌ కార్యకర్తలు అప్పుడే సంబరాలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ఆప్‌ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జిలేబీలు, లడ్డూలు సిద్ధం చేస్తున్నారు.

  • 10 Mar 2022 06:53 AM (IST)

    అర్ధరాత్రి పంజాబ్ సీఎం చన్నీ ప్రార్థనలు..

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్ గురుద్వారా శ్రీ కటల్‌గర్ సాహిబ్ వద్ద అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పంజాబ్‌లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు ఈవీఎం మెషీన్లే చెబుతాయని ఈ సందర్భంగా చన్నీ చెప్పుకొచ్చారు.

Published On - Mar 10,2022 6:44 AM

Follow us
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం