Andhra Pradesh: ‘అందరూ శాఖాహారులే… మరి రొయ్యల ముల్లే యాడపోయినట్టు’.. రాత్రయితే రొయ్యలు హాంఫట్

అందరూ శాఖాహారులే... మరి రొయ్యల ముల్లే యాడపోయినట్టు... ఇదీ గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతుల ఆవేదన. పంట చేతికొచ్చే దశలో...

Andhra Pradesh: 'అందరూ శాఖాహారులే... మరి రొయ్యల ముల్లే యాడపోయినట్టు'.. రాత్రయితే రొయ్యలు హాంఫట్
Prawns Chori
Follow us

|

Updated on: Sep 26, 2021 | 5:47 PM

అందరూ శాఖాహారులే… మరి రొయ్యల ముల్లే యాడపోయినట్టు… ఇదీ గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతుల ఆవేదన. పంట చేతికొచ్చే దశలో వలలు విసిరితే రొయ్యలు పడటం లేదట. దీంతో ఖంగారు పడ్డ ఆక్వా రైతులు రొయ్యలను దెయ్యం మింగిందా… లేక రెక్కలొచ్చి ఎగిరిపోయాయా… అంటూ మైండ్‌ బ్లాంక్‌ అయి పోలీసులను ఆశ్రయించారు. మా రొయ్యల్ని రాత్రి పూట ఎవరో ఎత్తుకెళుతున్నారు మహాప్రభో అంటూ వేడుకున్నారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాత్రి వేళల్లో రొయ్యల చెరువుల్లో రహస్యంగా రొయ్యలను చోరీ చేస్తున్న ఏడుగురు దొంగల ముఠాను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి మొత్తం 16 లక్షల 90 వేల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాలోని టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఆక్వా సాగు చేపట్టారు. రొయ్య పిల్లలను వదలడం దగ్గర నుంచి దాణా వేయడం, వాటి ఎదుగుదల పరిశీలించడం… వైరస్‌లు రాకుండా మందులు వేయడం అన్నీ సక్రమంగా పూర్తి చేశారు. ఇక రేపో, మాపో రొయ్యలను బయటకు తీసి అమ్ముకుందామనుకుని చెరువులో వలలు వేశారు. ఆశ్చర్యకరంగా రొయ్యలు మాయమైపోయాయి. ఒకటీ, అరా రొయ్యలు వలకు చిక్కాయి… దీంతో నిన్నటి దాకా చెరువు నిండా రొయ్యలు ఉన్నాయనుకుని సంబరపడ్డ రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దెయ్యం మాయం చేసిందా… లేక ఎవరైనా దొంగలు రాత్రికి రాత్రి రొయ్యలను ఎత్తుకెళ్ళారా… అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలా ఒకటి కాదు రెండుకాదు పలుమార్లు పలు ప్రాంతాల్లో ఆక్వా రైతులకు ఈ అనుభవం ఎదురైంది. లక్షల రూపాయ రొయ్యల పంట మాయం కావడంతో ఆక్వా రైతులు పోలీసులను ఆశ్రయించారు..

రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహించి మరీ దోపిడీ…

సింగరాయకొండ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మణ్‌ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని డిఎస్‌పి నాగరాజు, ఎస్‌పి మలిక గార్గ్‌ దృష్టికి తీసుకెళ్ళారు. రాత్రి సమయాల్లో చెరువుల దగ్గర ఎవరూ లేని సమయంలో కొంతమంది దొంగలు ఈ ఘరానా దోపిడీకి పాల్పడుతున్నట్టు అనుమానించారు. చెరువుల్లోని రొయ్యల పంట చేతికందివచ్చే సమయంలో కాపలా లేని చోట మాటు వేసి రెక్కీ నిర్వహిస్తారు. అందులో భాగంగా ఒక వ్యక్తి బైక్‌పై చెరువుల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కాపలా లేని చెరువులను గుర్తించి తమ ముఠా సభ్యులకు సమాచారం అందిస్తాడు. వెంటనే రంగంలోకి దిగిన ముఠా సభ్యులు ఏకంగా ఓ వ్యానును తీసుకొచ్చి చెరువుల్లో వలలు విసురుతారు. అందినకాడికి వలకు చిక్కిన రొయ్యలను వ్యానులో వేసుకుని ఉడాయిస్తున్నారు… ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చిన రొయ్యల పంటను కొనుగోలు చేసి ఎగుమతి చేసేందుకు ఓ వ్యాపారిని కూడా లైన్లో పెట్టుకున్నారు. దొంగతనం ఎంతో కాలం దాగదంటారు… వీరి పరిస్థితి కూడా ఇలాగే అయింది… ఆక్వా రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. రొయ్యల దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి మొత్తం 16 లక్షల 90 వేల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక వ్యాను, ఒక బైక్‌, వలలు, 7 లక్షల 50 వేల నగదు ఉన్నాయని ఒంగోలు డిఎస్‌పి నాగరాజు తెలిపారు.

Thieves

Also Read: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో యంగ్ హీరో ట్వీట్.. ఇది తన బాధ్యత అన్న యాక్టర్

పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై స్పందించిన మోహన్ బాబు.. తన మార్క్ చూపించారు