నిలోఫర్ ఆస్పత్రికి కరోనా సెగ..200 మంది సిబ్బందికి క్వారంటైన్ !
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి కరోనా సెగ తగిలింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా క్వారంటైన్కు వెళ్లాలని నిలోఫర్ సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి కరోనా సెగ తగిలింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా క్వారంటైన్కు వెళ్లాలని నిలోఫర్ సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా సిబ్బంది అందరూ క్వారంటైన్కు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసలు విషయంలోకి వెళితే…
నారాయణపేట్ జిల్లాలోని అభంగాపూర్కు చెందిన రెండు నెలల శిశువుకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. బాలుడికి కరోనా సోకినట్లు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు నెలల కిందట ఈ బాలుడు జన్మించాడు. ఇటీవల అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అన్ని టెస్ట్లు నిర్వహించారు. రిపోర్ట్లో శిశువుకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులను క్వారంటైన్కు తరలించారు. చిన్నారికి చికిత్స అందించిన ఆ మూడు రోజులు నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసిన అన్ని విభాగాల సిబ్బందిని క్వారంటైన్కి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వారిలో మొత్తం 200 మంది సిబ్బంది ఉండగా, వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు సహా ఇతర సిబ్బంది ఉన్నారు.
రెండు నెలల బాలుడికి కరోనా పాజిటివ్గా నమోదైనట్లు ఏప్రిల్ 17 శుక్రవారం రాత్రే జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నారాయణపేట మండలంలోని అభంగాపూర్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. రెండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్ సోకిన చిన్నారికి సంబంధించిన 18 మంది కుటుంబసభ్యులు, బంధువులు, ఓ వైద్యుడిని ఐసొలేషన్కు తరలించారు. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే, ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది.