India Corona Deaths: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం!
కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్డీఎంఏ) సిఫార్సు చేసినట్లు పేర్కొంది. ఎక్స్గ్రేషియా సహాయం.. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు.. సేవలు అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి పరిహార మార్గదర్శకాలను సిద్ధం చేసింది. కోవిడ్ కారణంగా భారత్లో మొత్తం 4 లక్షలా 45 వేల మందికిపైగా చనిపోయారు.
After the order of the Supreme Court, National Disaster Management Authority (NDMA) issues guidelines on ex-gratia for COVID-19 deaths and recommended that Rs 50,000 to be paid to the kin of those who died of COVID-19 out of state disaster relief funds pic.twitter.com/spcIbVjPVp
— ANI (@ANI) September 22, 2021
కాగా కరోనా మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం చెల్లించలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనతో సుప్రీం కోర్టు కూడా ఏకీభవించింది. మరణించినవారి బంధువులు గౌరవనీయమైన మొత్తాన్ని పొందేలా ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 30న తీర్పులో.. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్డీఎంఏను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితిని సుప్రీంకు వివరించింది కేంద్రం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సిఫార్సు మేరకు తాజాగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
పరిహారం అందాల్సిన కుటుంబాలు.. నిర్దేశించిన డాక్యుమెంట్లతో రాష్ట్ర అధికార యంత్రాంగం జారీ చేసే ఓ ఫామ్ ద్వారా తమ క్లెయిమ్స్ ని సమర్పిస్తారు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు క్లెయిమ్, ధృవీకరణ, మంజూరు, పంపిణీ ప్రక్రియ సరళంగా ఉండేలా చూస్తారు. అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్లు పరిష్కరించబడతాయి. కాగా ఆధార్తో అనుసంధానించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియల ద్వారా నగదు పంపిణీ చేయబడుతుందని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. పరిహారానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. అదనపు జిల్లా కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (CMOH), అదనపు CMOH లేదా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ హెడ్లతో కూడిన జిల్లా స్థాయి కమిటీలను సంప్రదించవచ్చు.
Also Read: అమ్మ ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య