మే 3 తర్వాత మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ !?
లాక్ డౌన్ ను మే 3 తరువాత కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే, మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్...!
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రెండోదశ లాక్డౌన్ మే 3తో ముగియనుంది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా.. తదితర ప్రజలు గుమికూడే ప్రదేశాలపై మే 3 తరువాత కూడా నిషేధం కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశంలో సంకేతాలు వచ్చాయన్నారు. దీంతో మద్యం ప్రియులు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. మందు అమ్మకాలు ఉంటాయా..? ఉండవా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు..అయితే, …
లాక్ డౌన్ ను మే 3 తరువాత కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే, మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరినట్లు తెలిసింది. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా ఉందని సమాచారం. మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆదాయం విషయంలో రాష్ట్రాలకు ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రజా రవాణా విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. విమాన సర్వీసులతోపాటు రైల్వే , బస్సు సర్వీసులను నిలిపివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే విషయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నదని చెబుతున్నారు. అయితే, లాక్డౌన్ కొనసాగింపుపై ఈ వారాంతంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.