Corona Vaccination: కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్.. ప్రపంచ దేశాల గణాంకాంలేం చెబుతున్నాయంటే?

ప్రపంచ మానవాళికి పెను ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌కు చెక్ పెట్టేదెలా? ఇదిపుడు కేవలం మన దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. 2020లోనే కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెడదామనుకున్న ప్రభుత్వాలకు కరోనా...

Corona Vaccination: కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్.. ప్రపంచ దేశాల గణాంకాంలేం చెబుతున్నాయంటే?
World Map Corona Virus Vaccine
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2021 | 7:21 PM

Corona vaccination crucial across the globe: ప్రపంచ మానవాళికి పెను ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌కు చెక్ పెట్టేదెలా? ఇదిపుడు కేవలం మన దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. 2020లోనే కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెడదామనుకున్న ప్రభుత్వాలకు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఛాలెంజింగ్‌గా ఎదురొచ్చింది. మన దేశంలోనైతే మార్చి తొలి వారం నుంచి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైంది. ఏప్రిల్ నెలలో సెకెండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. నియంత్రణ మార్గాలు తోచక… లాక్ డౌన్ విధించే పరిస్థితి లేక ప్రభుత్వాలు నెత్తి నోరు మొత్తుకుంటున్నాయి. కరోనా వైరస్ మాత్రం తన సెకెండ్ వేవ్‌లో లక్షలాది కేసులను నమోదు చేస్తూ.. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది.

కరోనా సోకిన వారు కోలుకుంటుండడం, వ్యాక్సిన్లు వచ్చేయడంతో ప్రజల్లో కరోనా జాగ్రత్తలపై నిర్లక్ష్యం ఏర్పడింది. దానికి తోడు శరవేగంగా విస్తరించేలా రూపాంతరం చెందిన యుకే వేరియంట్ కరోనా వైరస్ మహారాష్ట్ర ద్వారా యావత్ దేశాన్ని చుట్టేసింది. ఫలితంగా ఫిబ్రవరి నెలలో పదివేలకు లోపుగా కరోనా కేసులు నమోదై.. కట్టడిలోకి వచ్చేసినట్లు కనిపించిన కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగి.. ప్రతిరోజు మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యే దశకు చేరింది. ఈ నేపథ్యంలో అసలు కరోనాకు బ్రేక్ వేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే కొందరు వైద్య నిఫుణులు సాధ్యమేనని చెబుతున్నారు. ముందుగా.. కరోనా జాగ్రత్తలైన మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లు వాడడం కఠినంగా పాటించడంతోపాటు వీలైన త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవడం కరోనా కట్టడికి దోహదం చేస్తుందని వారు చెబుతున్నారు. మరి ఇంతకూ వ్యాక్సినేషన్ ఏ ఏ దేశాల్లో ఏ మేరకు కరోనా కట్టడికి ఉపయోగపడింది. గణాంకాంలేం చెబుతున్నాయి?

టీకాలతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్య వర్గాలు అంటున్నాయి. పలు దేశాల్లోని వ్యాక్సినేషన్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని వారు ఉటంకిస్తున్నారు. ఇజ్రాయిల్ దేశ జనాభాలో దాదాపు 56 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ఫలితంగా అక్కడ కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్‌కు ముందు ఇజ్రాయిల్‌లో రోజుకు దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇజ్రాయిల్ దేశంలో కేవలం 50 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే వున్నాయి. వ్యాక్సినేషన్‌ను యుద్ధప్రాతిపదికన చేపట్టిన అమెరికా, బ్రిటన్‌, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా వున్న మన దేశంలోను వ్యాక్సినేషన్ సత్ఫలితాలనే ఇచ్చిందని చెప్పాలి. మన దేశంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కేవలం 0.035 శాతం మందికి మాత్రమే కరోనా సోకింది. అంటే కరోనా వ్యాక్సిన్లు వైరస్ నియంత్రణలో బాగానే పని చేస్తున్నాయని చెప్పాలి.

ప్రస్తుతం ప్రపంచ జనాభా 786 కోట్లు. గత డిసెంబర్‌-జనవరి మధ్య వివిధ దేశాలలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం 172 దేశాల్లో టీకా అందుబాటులో వుంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసుల టీకా పంపిణీ జరిగింది. ప్రపంచ జనాభాలో పూర్తి స్థాయిలో 2 డోసులు టీకా తీసుకున్నవారు 6.6 శాతంగా వున్నారు. అత్యధిక టీకా డోసుల పంపిణీలో అగ్రరాజ్యం అమెరికా అందరికంటే ముందుంది. అమెరికాలో ఇప్పటి వరకూ 22.6 కోట్ల డోసుల టీకా పంపిణీ జరిగింది. అమెరికా జనాభాలో 28 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తయ్యింది. మొత్తం జనాభాలో 42 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పంపిణీ చేశారక్కడ. ఆ తరువాతి స్థానంలో చైనాలో 22.4 కోట్ల డోసుల టీకా పంపిణీతో రెండో స్థానంలో వుంది. అయితే దేశ జనాభాలో అత్యధిక శాతం మందికి టీకా అందించిన ఘనత మాత్రం ఇజ్రాయిల్‌ దేశానిదే. ఇజ్రాయిల్‌ జనాభాలో దాదాపు 56 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. జనాభాలో అత్యధిక శాతం మందికి టీకా అందించిన పది దేశాలను పరిశీలిస్తే… వ్యాక్సినేషన్‌ భారీగా చేపట్టిన దేశాలలో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గినట్లు తేలుతోంది.

నిజానికి సెకెండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న మనదేశంలోను వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగానే జరుగుతోంది. నవంబర్ 2020లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన అమెరికాలో ఇప్పటి వరకు 22 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ కాగా.. జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభించిన మనదేశంలో కేవలం వంద రోజుల్లో 15 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. అయితే.. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం జనాభా కలిగి వుండి.. జనసాంద్రత అత్యధికంగా వున్న మన దేశంలో కరోనా వైరస్ సులువుగా విస్తరించగలుగుతోంది. దానికి తోడు యుకే వేరియంట్ కరోనా వైరస్‌కు శరవేగంగా విస్తరించే నైజం వుంది. దానికితోడు ప్రజల్లో కరోనా అంటే భయం తగ్గడం కూడా మన దేశంలో సెకెండ్ వేవ్ కరోనా ఉధృతి తీవ్రంగా వుండడానికి దారి తీస్తోంది. అయితే వ్యాక్సినేషన్ వేగం పుంజుకునే దాకా కరోనా జాగ్రత్తలను గట్టిగా పాటించడ ద్వారా మాత్రమే సెకెండ్ వేవ్ కరోనాను నియంత్రించవచ్చని వైద్య వర్గాలంటున్నాయి.

ALSO READ: ఆత్మావలోకనంలో కేంద్ర ఎన్నికల సంఘం? చివరి అంకంలో దిద్దుబాటు చర్యలు!