తెలుగు రాష్ట్రాలపై కోవిడ్ పంజా…ఒక్కరోజులోనే
దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా...
దేశ వ్యాప్త లాక్ డౌన్ అమలులో ఉన్నా దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10, 455కు చేరింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 358కి పెరిగింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తున్నది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోలు చాస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తిః ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. కరోనా మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 93 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా ఈ జిల్లాలో ఇంత వరకూ ఒకరు మరణించారు. గుంటూరు తరువాత కర్నూలులో 84 మందికి కరోనా సోకింది.
జిల్లాలవారిగా కరోనా కేసుల సంఖ్య చూస్తే… అనంతపురంలో కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు పాజిటివ్ కేసుల సంఖ్య 23, తూర్పుగోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 93 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. కడప జిల్లా వ్యాప్తంగా 31 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 36 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 84 కేసులు 1 మరణం, నెల్లూరు జిల్లాలో 56 కరోనా కేసులు గుర్తించారు. ప్రకాశం 41, విశాఖ 20, పశ్చిమ గోదావరి 23 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే, శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు జిల్లాలు కరోనా పంజా నుంచి తప్పించుకున్నాయి.
తెలంగాణలో కరోనా విస్తరణః తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 472 ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. సోమవారం కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్ చేసిన అయిన వారి సంఖ్య 103గా ఉంది. ఇక ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 472 మంది ఉన్నారు.
గ్రేటర్లోనే కరోనా కేసులు అధికంః మరోవైపు ఎక్కువ కేసులు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదువుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొంది. నగర పరిధిలో కంటైన్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కరోనాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. తక్షణ కార్యచరణకు 30 జీహెచ్ఎంసీ సర్కిళ్లలో సీనియర్ డాక్టర్లకు డీఎంహెచ్ఓ స్థాయి అధికారాలు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.