AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు.. ఇక ఉద్యోగాలకు డోకాలేనట్టే!

పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులకు ఆధునిక అవసరాలకు తగ్గట్టు పేర్లు, సిలబస్ మార్పులు చేపట్టింది.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు.. ఇక ఉద్యోగాలకు డోకాలేనట్టే!
Polytechnic Education
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 13, 2026 | 5:36 PM

Share

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఆధ్వర్యంలో ఈ మార్పులు జరిగాయి. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు, పూర్వ విద్యార్థుల సూచనలతో కొత్త కోర్సులు ఖరారు చేశారు. ఈ కోర్సులకు సంబంధించిన నూతన సిలబస్‌ను కూడా ఐఐటీ హైదరాబాద్ పర్యవేక్షణలో రూపొందించారు. వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచి కొత్త కోర్సులు, కొత్త సిలబస్ అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు పొందేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవ సేన స్వయంగా ఢిల్లీ వెళ్లి చర్యలు చేపట్టడం గమనార్హం.

ఇక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తొలి సంవత్సరంలో సెమిస్టర్ విధానంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కీలక మార్పు చేశారు. మొదటి సంవత్సరం నుంచి వార్షిక పరీక్షల విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానుంది.సాధారణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిలబస్ మార్పులు చేస్తారు. అయితే 2024–25లో సిలబస్ మార్చినప్పటికీ, పరిశ్రమల అవసరాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో 2026–27 నుంచే కొత్త సిలబస్‌ను ముందస్తుగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ మొత్తం ప్రక్రియ ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి నేతృత్వంలో సాగింది. ఆయన స్వయంగా ఒకప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థి కావడం విశేషం. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి పాలకమండలిలో సలహాదారుడిగా కూడా నియమించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సును తెలంగాణ ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకొని నిర్వహించనున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులు

సెమీకండక్టర్స్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, ల్యాండ్ స్కేప్ డిజైన్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

పేర్లు మారిన కోర్సులు

ఇప్పటివరకు టీవీ అండ్ వీడియో ఇంజినీరింగ్‌గా ఉన్న కోర్సును మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌గా మార్చారు. ప్రింటింగ్ టెక్నాలజీని ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డేటా అనలిటిక్స్‌గా, టెక్స్టైల్ టెక్నాలజీని టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీగా, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీసెస్‌ను కంప్యూటర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌గా మార్పు చేశారు.ఈ మార్పులతో పాలిటెక్నిక్ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక నేరుగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.