Special TET Exams: ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు.. ఇకపై టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్షలు రాసేందుకు అవకాశం!
రాష్ట్రంలో యేటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలర్థులతోపాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. .

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో యేటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలర్థులతోపాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఏటా రెండు సార్లు నిర్వహించే సాధారణ టెట్లతోపాటు అదనంగా కేవలం సర్వీస్లో ఉన్న టీచర్ల కోసం మరో రెండు స్పెషల్ టెట్లను నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ టెట్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు మంగళవారం (జూన్ 3) విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచించింది.
Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్ విసిరే చిక్కు ప్రశ్న
పలువురు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలతో పాటు, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (డీఎస్ఈ) డాక్టర్ నవీన్ నికోలస్ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వు ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం మాత్రమే ప్రత్యేక TETలు నిర్వహించబడతాయి. అర్హత పరీక్షలో ఇంకా ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయులకు అదనపు అవకాశం కల్పించం కోసం స్పెషల్ టెట్లను నిర్వహిస్తున్నారు.
గతేడాది సాధారణ టెట్(TG TET 2025)లో భాగంగానే ఇన్సర్వీస్ టీచర్లకూ ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై టీఎస్ యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా వచ్చే రెండేళ్లలో టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీం కోర్టు 2025 సెప్టెంబరులో తీర్పు వెలువరించింది. ఇటీవల దాన్ని మరో ఏడాది పొడిగించింది. అంటే 2028 ఆగస్టు నాటికి ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. ప్రత్యేక TETలకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు, షెడ్యూల్, అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేయనున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది 2026 జనవరిలో తొలి విడత టెట్ పరీక్ష జరిగింది. తాజాగా తుది విడత టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయగా.. పరీక్షలు జూన్ 15 నుంచి నిర్వహించనున్నారు. ఈసారి టెట్కు మొత్తం 1.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇన్ సర్వీస్ టీచర్లు 28,149 మంది ఉన్నారు. ఈ టెట్తోపాటు స్పెషల్ టెట్లను టీచర్ల కోసం మాత్రమే విద్యాశాఖ నిర్వహించనుంది.




