SBI Youth For India Fellowship 2025: ‘ఎస్బీఐ’ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే రూ.మూడున్నర లక్షల వరకు జీతం
డిగ్రీ పూర్తి చేసిన యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు 13 నెలల పాటుసాగే యూత్ ఫెలోషిప్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

అమరావతి, ఏప్రిల్ 14: డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుత అవకాశం అందిస్తోంది. ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 పేరిట ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి ఎస్బీఐ ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 13 నెలల వరకు కొనసాగే ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును నడిపించే లక్ష్యంతో ఏర్పాటు చేసింది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచడానికి అవకాశం ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది అక్టోబరులోపు ఏదైనా డిగ్రీ కోర్టు పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్ 1, 2025వ తేదీ నాటికి 21 నుంచి 32 ఏళ్ల అభ్యర్థులు ఈ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. భారతీయ పౌరులై ఉండాలి. నేపాల్, భూటాన్ లేదా ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ (ఐఓసీ) ఉన్నవారూ అర్హులే. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడానికి, గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచి యువతలో సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు అవసరమైన నైపుణ్యాలపై 13 నెలల కాలంలో శిక్షణ ఇస్తారు. వీరంతా గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామీణ పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్కు ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16 000 చొప్పున స్టైపెండ్తోపాటు.. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు మరో రూ.2000, ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ.వెయ్యిచొప్పున చెల్లిస్తారు. ఇక ఫెలోషిప్ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90 వేల వరకు అందజేస్తారు. మొత్తంగా పూర్తి కాలంలో రూ.3,37,000 స్టైపెండ్ అందుకోవచ్చన్నమాట.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.