AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Exams: తొలిరోజు గ్రూప్‌ 2 పరీక్షకు భారీగా డుమ్మా.. 46.30 శాతం మంది మాత్రమే హాజరు!

ఎన్నో సంవత్సరాల తర్వాత భారీగా కొలువుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష తొలిరోజు కనీసం సగం మంది కూడా పరీక్షకు హాజరుకాకవపోవడం చర్చణీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ 2 పోస్టులకు తీవ్ర పోటీ ఉంటుంది. దరఖాస్తులు ఐదున్నర లక్షలు వచ్చినా.. వీరిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం విశేషం..

TGPSC Group 2 Exams: తొలిరోజు గ్రూప్‌ 2 పరీక్షకు భారీగా డుమ్మా.. 46.30 శాతం మంది మాత్రమే హాజరు!
TGPSC Group 2 Exam
Srilakshmi C
|

Updated on: Dec 16, 2024 | 2:18 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే రాతపరీక్షలు డిసెంబరు 15న ప్రారంభమవగా.. డిసెంబర్‌ 16వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 4 పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తొలిరోజు ఉదయం పేపర్‌ 1, మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేయగా.. 74.96 శాతం మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) వెల్లడించింది.

అయితే ఆదివారం జరిగిన పేపర్‌ 1 పరీక్షకు 2,57,981 మంది అంటే 46.75 శాతం మంది, పేపర్‌ 2 పరీక్షకు 2,55,490 మంది అంటే 46.30 మంది పరీక్షలు రాశారని కమిషన్‌ తెలిపింది. మొత్తం మీద తొలిరోజు పరీక్ష రాసిన అభ్యర్ధులు సంఖ్య సగానికి కూడా నమోదుకాక పోవడం విశేషం. అక్కడక్కడా కొందరు అభ్యర్ధులు పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు గేట్లు మూసివేశారు. దీంతో వారంతా పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. తొలిరోజు ఓ పరీక్ష కేంద్రం వద్ద ఓ అభ్యర్థి లోదుస్తుల్లో మొబైల్‌ఫోన్‌ పెట్టుకుని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. సిబ్బంది తనిఖీల్లో గుర్తించి వెంటనే దానిని పోలీసులకు అప్పగించారు. ఆ అభ్యర్థిపై మాల్‌ప్రాక్టీస్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, అనంతరం అరెస్ట్‌ చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. మొత్తం మీద తొలిరోజు జరిగిన పేపర్‌ 1, 2 పరీక్షలు ప్రశాంతంగానే జరిగాయి. ఇక నేడు పేపర్ 3, 4 పరీక్షలు జరుగుతున్నాయి. వీటితో గ్రూప్‌ 2 పరీక్షలు ముగుస్తాయి.

తొలిరోజు పేపర్ 1, 2 ప్రశ్నల సరళి ఎలా ఉందంటే..

డిసెంబరు 15న ఉదయం పేపర్‌ 1 పరీక్ష జనరల్‌ స్టడీస్‌ విభాగంలో జరిగింది. ఈ పేపర్లో వచ్చిన ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయని, అందువల్ల సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, సినిమా, అంతర్జాతీయ, భౌతిక, రసాయనశాస్త్రాలు, ఇంగ్లిష్, రీజనింగ్‌ వంటి అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 2 పరీక్ష హిస్టరీ, పాలిటీ విభాగాల్లో జరిగాయి. ఇందులో ప్రశ్నలు కొంత తేలికగా ఉన్నాయని, రిజర్వేషన్లు – జోగిని వ్యవస్థ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, తెలంగాణ జిల్లాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల అధికారాలు, పరిపాలన అంశాలపై ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్ధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us