JEE Advanced 2021: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రం అవుతున్న నేపథ్యంలో జేఇఇ ఎగ్జామ్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఖరగ్పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2021(జేఈఈ)ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జులై 03 వ తేదీన జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. సవరించిన పరీక్ష తేదీన త్వరలోనే ప్రకటిస్తామని ఐఐటీ ఖరగ్పూర్ తెలిపింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
జెఇఇ మెయిన్ పరీక్షను క్లియర్ చేసిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు జెఇఇ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పేపర్ I, పేపర్ II ఉంటాయి. పేపర్ I ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు నిర్వహించేలా షెడ్యూల్ చేశారు.
జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష దేశంలోని 23 ఐఐటిలలో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ కోర్సులకు ప్రవేశ ద్వారం. ప్రతి సంవత్సరం జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షను ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటిలు- ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి, ఐఐటి గువహతి, ఐఐటి రూర్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి.
జెఇఇ అడ్వాన్స్డ్ ఎలిజిబిలిటీ.. ఐఐటి ప్రవేశ పరీక్ష కోసం ఐఐటి ఖరగ్పూర్ ఇంతకుముందు సబ్జెక్ట్ వారీగా సిలబస్ను అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో విడుదల చేసింది. జెఇఇ అడ్వాన్స్డ్ 2021 కోసం మాక్ పరీక్షలు అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఐఐటిలలో ప్రవేశానికి అర్హత ప్రమాణాలు.. అభ్యర్థులు 12 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మరేదైనా సబ్జెక్టుతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 75% ఉత్తీర్ణత శాతం కలిగి ఉండాలనే నిబంధనను తొలగించారు.
జెఇఇ అడ్వాన్స్డ్ 2020 అభ్యర్థులకు రెండవ అవకాశం.. 2020 లో జెఇఇ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకుని కరోనా వ్యాప్తి కారణంగా పరీక్ష రాయలేకపోయిన వారు 2021 జేఇఇ అడ్వాన్స్డ్ పరీక్షకు నేరుగా హాజరు అయ్యేందుకు అనుమతించారు. జెఇఇ అడ్వాన్స్డ్ 2021 రాయడానికి రెండవ అవకాశం పొందిన అభ్యర్థులందరూ అదనపు అభ్యర్థులుగా పరిగణించబడుతారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం jeeadv.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు.
Also read:
EETALA RAJENDAR: కమలం వైపే ఈటల.. అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి..!