Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే
ఏపీ, తెలంగాణలోని విద్యార్ధులకు సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం తిరిగి తరగతులు జూన్ నెలారంభం నుంచే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్ధులు ఈ మేరకు తిరిగి తరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు..

హైదరాబాద్, మే 24: తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ఇంటర్ బోర్డును కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్లను సైతం జారీ చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కేలండర్ను కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలి తాజాగా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం 232 రోజులు పని చేయనున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 1వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి. ఇక తెలంగాణలోనూఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను మార్చి 30 విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జూన్ నెల ఆరంభం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాలు ఉండనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
మరోవైపు స్కూల్ పిల్లలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్ధులు జూన్ 12 నుంచి బడిబాట పట్టనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




