పొద్దున్నే రోడ్డు పక్కన కనిపించిన మూట.. ఏంటాని తెరచి చూడగా గుండెలు పగిలే దృశ్యం!
ధనం మూలం ఇదం జగత్ అంటరు కానీ, ధర్మం మూలం ఇదమ్ జగత్ అని అనరు. ఎందుకంటే నేటి నాగరిక సమాజంలో అన్నిటికీ కొలమానం డబ్బు. ప్రపంచాన్ని శాసించగలిగే శక్తిమంతురాలు ఈ డబ్బే..! కానీ అదే డబ్బు ఒక్క ప్రాణాన్ని కూడా కొనలేని పేదరాలు! జగమంతా ఈ కాసుల పంజరంలోనే చిక్కుకుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చివరికి కాటికి చేరడానికి కూడా బాటలు వేసేది కాసులేనిని తాజా ఘటన మరోమారు నిరూపించింది..

మామల్లపురం, మే 24: డబ్బు పిశాచి ఓ అభాగ్యురాలి జీవితంలో నిప్పుల వర్షం కురిపించింది. చేతిలో చిల్లిగవ్వలేని ఓ పెద్దాయన అర్ధాంతరంగా అర్ధాంగి కాలం చేస్తే కాటి వరకు తోడుగా నడవలేక రోడ్డు పక్కనే సంచిలో మూటకట్టి వదిలేసి దుఃఖం దిగమింగి అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పల్లావరం సమీపం త్రిశూలం ముక్కని అమ్మన్ ఆలయ వీధిలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..
చెన్నైలోని పల్లావరం సమీపం త్రిశూలం ముక్కని అమ్మన్ ఆలయ వీధిలో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ బస్తా నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పల్లావరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని బస్తాను ఓపెన్ చేసి చూడగా.. అందులో చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం కుక్కి కనిపించింది. మృతురాలిని అదే ప్రాంతానికి చెందిన పూల వ్యాపారి భఖ్యాలక్ష్మిగా గుర్తించారు. ఆమె భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు 10 మంది సంతానం ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె స్థానికంగా పువ్వులు విక్రయిస్తూ అదే ప్రాంతంలోని ఓ హోటల్లో పనిచేస్తున్న మహమ్మద్ ఆసన్ (63)తో కలిసి ఉంటోంది.
ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా అక్కడ అనేక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో హసన్ తన జీవనోపాది కోల్పోవడంతో వీరి ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న భఖ్యలక్ష్మి బుధవారం మరణించింది. అయితే అంత్యక్రియల ఖర్చులకు డబ్బులేక.. రోడ్డుపక్కన వెళ్లేవారు లేదంటే సామాజిక కార్యక్రర్తలు అంత్యక్రియలు నిర్వహిస్తారనే ఆశతో మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసుల విచారణలో హసన్ తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
