బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మంత్రి రాజీనామా!
కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం ఆమోదించినట్లు సమాచారం. రవ్నీత్ సింగ్ ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు.

పంజాబ్ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రైల్వే శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రవ్నీత్ సింగ్ బిట్టు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పదవీకాలం జూన్లో ముగిసింది. రాజ్యసభ సభ్యత్వం లేకపోవడంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలమైన నాయకుడిగా బిట్టును ముందుకు తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్న పంజాబ్లో పార్టీ బలోపేతంపై ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా హిందువులు, సిక్కులు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఓటర్లను ఆకర్షించే వ్యూహంపై ఆయన పనిచేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన రవ్నీత్ సింగ్ బిట్టు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2024లో కాంగ్రెస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. తర్వాత కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి నామినేట్ కావడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
ఇటీవల పంజాబ్కు సంబంధించిన పలు సున్నిత అంశాలపై బిట్టు తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సట్లజ్’ చిత్రాన్ని విమర్శిస్తూ, అది సమాజంలో ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర జనాభాలో సిక్కులు సుమారు 58 శాతం, హిందువులు 39 శాతం ఉండగా, దళితులు దాదాపు 32 శాతం, ఓబీసీలు సుమారు 16 శాతం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ప్రధాన సామాజిక వర్గాలన్నింటినీ ఆకర్షించే వ్యూహంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
