AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CBSE Students: ఆ స్కూళ్లలో చదువుతున్న 77,478 మంది టెన్త్ విద్యార్థులకు ‘మరో కొత్త’ సమస్య! ఒత్తిడితో చిత్తు చిత్తు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఇరకాటంలో పడ్డారు. జగన్‌ సర్కార్‌ ప్రభుత్వ బడుల్లో ప్రవేశ పెట్టిన సీబీఎస్‌ఈ విధానం ప్రస్తుతం విద్యార్ధులకు సంకటంగా మారింది. వెయ్యి పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సీబీఎస్సీ విధానం ప్రకారంగా చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగా..

AP CBSE Students: ఆ స్కూళ్లలో చదువుతున్న 77,478 మంది టెన్త్ విద్యార్థులకు ‘మరో కొత్త’ సమస్య! ఒత్తిడితో చిత్తు చిత్తు
AP CBSE Students
Srilakshmi C
|

Updated on: Sep 19, 2024 | 7:05 AM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఇరకాటంలో పడ్డారు. జగన్‌ సర్కార్‌ ప్రభుత్వ బడుల్లో ప్రవేశ పెట్టిన సీబీఎస్‌ఈ విధానం ప్రస్తుతం విద్యార్ధులకు సంకటంగా మారింది. వెయ్యి పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సీబీఎస్సీ విధానం ప్రకారంగా చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగా లేవని, ఈ ఏడాది వారిని రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఎస్సీ చదువుతున్న విద్యార్ధులకు 50 శాతం సిలబస్‌ కూడా పూర్తైంది. వీరందరికీ ఇప్పుడు అర్ధాంతరంగా రాష్ట్ర బోర్డు సిలబస్‌ ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు కూడా అయోమయంలో ఉన్నారు. కనీసం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ దశలో ఈ నిర్ణయం తీసుకున్నా ఏదో విధంగా విద్యార్ధులు సన్నద్ధమయ్యేవారు. కూటమి సర్కార్ తాజా నిర్ణయంతో రెండున్నర నెలల్లోనే తెలుగు సబ్జెక్టును పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) గతంలో చేసిన తప్పిదం పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది.

రాష్ట్రంలో మరో విచిత్రమేమిటంటే సీబీఎస్‌ఈకి పాత తెలుగు పాఠ్యపుస్తకం, రాష్ట్ర బోర్డు వారికి కొత్త పాఠ్యపుస్తకం అమలు చేస్తున్నారు. మొన్నటి వరకు సీబీఎస్‌ఈలో పాత తెలుగు పాఠ్యపుస్తకం చదివిన విద్యార్థులు ఇప్పుడు రాష్ట్ర బోర్డుకు మారినందున తెలుగు కొత్త పుస్తకం చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయి అధికారులతో సెప్టెంబర్ 17న టెలికాన్ఫరెన్సు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌.. సీబీఎస్‌ఈ వారికి కొత్త తెలుగు పాఠ్యపుస్తకాన్ని నవంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ అప్పటికీ పూర్తి కాకపోతే డిసెంబరు 5లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఈ రెండున్నర నెలల్లోనే పాఠాలు వినడం, నోట్సు రాసుకోవడం, అంతర్గత పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో అధిక సిలబస్‌ చదవాల్సి ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

గతంలో తెలుగు పాఠ్యపుస్తకాన్ని మారుస్తున్నప్పుడు సీబీఎస్‌ఈకి ఎస్‌సీఈఆర్టీ సమాచారం అందించలేదు. తెలుగు సబ్జెక్టును ఐచ్ఛికంగా ఎంచుకున్న వారికి పాత తెలుగు పుస్తకమే ఉంటుందని సీబీఎస్‌ఈ బోర్డు సమాచారం ఇచ్చింది. దీంతో సీబీఎస్సీ బోర్డు విద్యార్థులంతా పాత తెలుగు పుస్తకమే చదువుతున్నారు. రాష్ట్ర బోర్డు విద్యార్థులకు మాత్రం కొత్త తెలుగు పుస్తకం ఇచ్చారు. ఎస్‌సీఈఆర్టీ చేసిన పనికి ప్రైవేటు బడుల్లోని సీబీఎస్‌ఈ విద్యార్థులు పాత పుస్తకాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ బడుల్లోని వారికి సర్కారే పాత పుస్తకాలను ముద్రించి ఆలస్యంగా పంపిణీ చేసింది. ఇప్పుడు బోర్డు మారడంతో ప్రభుత్వ బడుల్లోని 77,478 మంది పదో తరగతి విద్యార్ధులంతా కొత్త పుస్తకం చదవాల్సి వస్తోంది. ఇప్పటికే విద్యా సంవత్సరంలో 3 నెలలు గడిచిపోయాయి. పదో తరగతి విద్యార్ధులకు మార్చిలోనే పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయి. ఈలోపు సిలబస్‌ పూర్తి చేయడం, విద్యార్థులు చదవడం కష్టమైన పనిగా విద్యా నిపుణులు భావిస్తున్నారు. సీబీఎస్సీలో లేని హిందీ సబ్జెక్టును ఇప్పుడు ఈ విద్యార్ధులు మళ్లీ కొత్తగా చదవాల్సి ఉంది. ఇదంతా విద్యార్ధులపై అదనపు భారం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.