AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది..! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్షలు ఎప్పట్నుంచంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆదివారం (ఏప్రిల్‌ 20న) విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ఏప్రిల్‌ 20 నుంచే అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమైంది..

AP Mega DSC 2025 Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది..! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్షలు ఎప్పట్నుంచంటే
AP Mega DSC 2025 Notification
Srilakshmi C
|

Updated on: Apr 20, 2025 | 10:26 AM

Share

అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణ వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది.

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా ఆదివారం (ఏప్రిల్ 20) ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమైనాయి. కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 45 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న విద్యాశాఖ మే 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఫీజు కింద రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజుల చెల్లింపులు కూడా మే 15 వరకు అవకాశం ఉంటుంది. అయితే గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఫీజు చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే వారు దరఖాస్తు ఫీజు చెల్లించనవససరం లేదు. అదనంగా ఇతర సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి. అనంతరం మే 30 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌ 1గా ఇంగ్లిష్‌ భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మార్కులు లెక్కిస్తారు. ఇక ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్‌ వెయిటేజీ 20 శాతం వర్తిస్తుంది.

జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టుల వివరాలు

Dsc District Wise Vecancies

జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

Zone Wise Vecancies

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 కొత్త సిలబస్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక జూన్‌ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో మెగా డీఎస్సీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 20వ తేదీ నుంచి డీఎస్సీ అభ్యర్ధులకు మాక్‌ టెస్ట్‌లు సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఏ సబ్జెక్టు పరీక్ష పూర్తయినప్పటికీ ఆ మరుసటి రెండో రోజే ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత పరీక్షలు ముగిసిన వారం రోజులకే మెగా డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.