Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..
అది రాత్రి 9 గంటల సమయం. పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న ఆ రహదారిపై వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. అంతలోనే దారికి అడ్డంగా ఒక భారీ స్పీడ్ బ్రేకర్ లాంటిది కనిపించింది. కట్ చేస్తే.. అది స్పీడ్ బ్రేకర్ కాదు, సడన్గా చూస్తే గుండె ఆగినంత పని చేసే భారీ కొండచిలువ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

శ్రీకాకుళం జిల్లా పలాస శివారులోని కంబిరిగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో దాదాపు 8 నుండి 10 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. చీకటి వేళ అంత పెద్ద కొండచిలువను అంత దగ్గరగా చూసిన వాహనదారులుకొందరు భయంతో అరుపులు అరవగా, మరికొందరికి క్షణం పాటు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ కొండచిలువ ఎవరిపై దాడి చేయకుండా చాలా నెమ్మదిగా రోడ్డు దాటుకుంటూ వెళ్లింది. అది రోడ్డు దాటే వరకు ఇరువైపులా ప్రయాణికులు వాహనాలను నిలిపివేయడంతో కొన్ని నిమిషాల పాటు అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. చివరకు ఆ భారీ కొండచిలువ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా నెమ్మదిగా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
అటవీ అధికారుల హెచ్చరిక
సదరు ప్రాంతం అటవీ సరిహద్దును ఆనుకుని ఉండటంతో తరచూ ఇటువంటి వన్యప్రాణులు, పాములు రోడ్డుపైకి వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డుపై లేదా జనావాసాల్లో ఇలాంటి వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే తమకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.
