Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Exams: ఇంటర్‌ సిలబస్, పరీక్షల విధానం మారుతుందోచ్‌.. ఎప్పట్నుంచంటే?

ఇంటర్మీడియట్ విద్యార్ధుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు కీలక మార్పులు తీసుకువచ్చేందుకు సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగా ఇంటర్ సిలబస్, పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది..

AP Inter Exams: ఇంటర్‌ సిలబస్, పరీక్షల విధానం మారుతుందోచ్‌.. ఎప్పట్నుంచంటే?
Inter Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2024 | 3:38 PM

అమరావతి, డిసెంబర్‌ 14: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధుల వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19వ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, అలాగే మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తాజాగా టైం టేబుల్ విడుదల చేశారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌లో కీలక మార్పులుచోటు చేసుకోనున్నాయి. ఫస్ట్ ఇయర్‌ సిలబస్‌తో పాటు పరీక్ష ప్రశ్నపత్రాల విధానం మారనుంది. ఇంటర్‌లో ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యేలా బిట్‌ పేపర్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తంగా ఇంటర్‌ను సీబీఎస్‌ఈ విధానంలో తీసుకురానున్నారు. సైన్సు గ్రూపులకు దాదాపుగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే తీసుకొస్తున్నారు. ప్రశ్నల్లో ఎక్కువగా ఒకటి, రెండు మార్కులవి ఉండేలా ప్రశ్నాపత్రం విధానాన్ని తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను గత పదేళ్లుగా మార్చలేదు. పైగా ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో కొంతవరకే సిలబస్‌ మారుస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సిలబస్‌ చాలా వరకు మారనుంది. తెలుగు, ఆంగ్ల భాషా సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించి, కొత్తవాటిని చేర్చనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీఈఆర్టీలో జీవశాస్త్రం సబ్జెక్టులో వృక్ష, జంతుశాస్త్రాలు కలిపి ఉన్నాయి. వీటిని విడదీసి రెండుగా తీసుకొస్తున్నారు. గణితంలోనూ సిలబస్‌ తగ్గనుంది. కొన్ని అధ్యాయాల్లో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ఉండగా.. వాటిని సైతం తగ్గిస్తున్నారు. ఫిజికల్‌ సైన్సు సబ్జెక్టులో భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఉండగా.. వీటినీ వేర్వేరుగా రెండు సబ్జెక్టులుగా మారుస్తారు. ఆర్ట్స్‌లో చరిత్రకు సంబంధించి రాష్ట్రచరిత్ర పాఠాలు ఉండేలా మార్పులు తీసుకొస్తారు.

ఇంటర్మీడియట్‌ విద్యలో సీబీఎస్‌ఈతో పోల్చితే రాష్ట్రబోర్డులో ఉత్తీర్ణత తక్కువగా ఉంటోందని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యార్ధుల ఉత్తీర్ణత పెంచడానికి ప్రశ్నాపత్రంలోనూ కీలక మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం గణితం ప్రశ్నపత్రంలో 2, 4, 7 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. వీటిని ఒకటి, రెండు, నాలుగు, ఆరు మార్కుల ప్రశ్నలుగా మారుస్తున్నారు. 1, 2 మార్కులకే దాదాపు 50 శాతం వెయిటేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక మార్కు ప్రశ్నలు 13, 2 మార్కుల ప్రశ్నలు 8, 4 మార్కుల ప్రశ్నలు 4, 6 మార్కుల ప్రశ్నలు ఐదు చొప్పున ఉండేలా క్వశ్చన్‌ పేపర్‌ను మార్చనున్నారు. అలాగు భౌతిక, రసాయన, వృక్ష, జంతుశాస్త్రాలకు ప్రస్తుతం 2, 4, 8 మార్కుల విధానం ఉండగా.. దీన్ని సైతం 1, 2, 4, 6 మార్కుల ప్రశ్నలకు మార్చనున్నారు. ఇంటర్ విద్యావిధానంలో అధిక ఉత్తీర్ణత పొందడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.